GNTR: తెనాలిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇవాళ సోలార్ హెల్మెట్లు పంపిణీ చేశారు. సోలార్ ద్వారా చల్లదనం కలిగించే ఫ్యాన్లతో ఉన్న 40 హెల్మెట్లను అందించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు దివంగత నేతి పరమేశ్వర శర్మ కుమారుడు, కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ప్రిన్సిపల్ చలపతి దంపతులు వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో వన్ టౌన్, టు టౌన్ సీఐలు పాల్గొన్నారు.
KKD: తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నుంచి ఒరిస్సాకు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ కింగ్ పిన్ విడిపోవడంతో నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
PLD: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సమాజ సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మినరసింహ స్వామివారిని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి , వేదాశీర్వచనం అందించారు. అలాగే, స్వామివారి దర్శన అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ శ్రీ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గాజువాక నుంచి నక్కపల్లి వైపు బైక్పై పప్పల సుజాత వెనక కూర్చుని వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమెపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: అనంతగిరి మండలం జాలాడ నుంచి కుడియా వరకు రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారి అంతా కంకర రాళ్లతో ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఇద్దరు ఉపాధ్యాయులు బైక్పై వస్తుండగా వాహనం జారి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KDP: ముద్దనూరు మండలంలో జరిగిన గొర్రెల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. కే.తిమ్మాపురం, కొలవాలి గ్రామాల్లో రాత్రివేళల్లో గొర్రెల దొంగతనాలు జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో తాడిపత్రి మండలానికి చెందిన గంగరాజు, చంద్ర కులయ్య ఈ దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజనాథ్ శనివారం సోషల్ మీడియా, ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులతో సమానమని, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగనన్న కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించారు.
W.G: జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలనీ అధికారులని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివారం అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ అధికారులు లంక, తీరప్రాంత గ్రామాలలో మడ అడవులు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
KRNL: జిల్లాలో ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు బంగారం భవిష్యత్తు ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారిని లలితా వరలక్ష్మి అన్నారు. శనివారం ఉద్యాన సమావేశ మందిరంలో డీపీఎం మాధురి యాదవ్ కలిసి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలన్నారు.
NTR: విజయవాడ శ్రీనగర్ రెండవ లైన్కు చెందిన లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ, వాటర్ క్యాన్స్ సరఫరా చేయడానికి అద్దె బండితో కిరాయి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి, రూ.35,000/ విలువచేసే రిక్షా బండిని లక్ష్మికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
మార్కాపురం: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూప్ టాప్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం మార్కాపురం మండలం పెద్ద యాచవరంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూట్ టాప్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
NLR: 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలను ఇంటి యజమానులను చేసిన ఘనత వైసీపీదేనని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నాడు జగనన్న రాజ్యంలో అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలతో మహిళల ఇళ్లలో వెలుగులు నిండాయని, అయితే నేడు కూటమి పాలనలో మహిళల రక్షణ గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ మహిళా బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు.
GNTR: తెనాలి పురపాలక సంఘ పరిధిలో గాంధీ పార్కు ఓల్డ్ ట్యాంక్ వద్ద షట్టర్ లీక్ ఏర్పడిన కారణంగా ఆదివారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. 7వ వార్డుకు సగభాగం & 10,11 వార్డులకు పూర్తిగా మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. పట్టణ పరిధిలో 7, 10, 11 వార్డు ప్రజలు దీనిని గమనించాలని కోరారు.
కోనసీమ: ప్రతి నియోజకవర్గంలో మీడియా హౌస్ల ఏర్పాటుకు కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ ఇచ్చారు. అంబాజీపేటలో రూ.37 లక్షలతో నిర్మించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, రైల్వే పాసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.