కృష్ణా: జాతీయ సర్వే దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ బాలాజీ నిన్న రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడి, ఉత్సాహంగా ఆరోగ్యకరంగా జీవిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించారు.
PPM: విలేజ్ సర్వేయర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సర్వే శాఖ ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సర్వేయర్ల సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల పనితీరు చూసి అన్ని శాఖల అధికారులు ప్రశంసిస్తున్నారన్నారు.
పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతే సంబంధిత వైద్యులకు నోటీసులు ఇవ్వాలని జేసీ సంజనా సింహ ఆదేశించారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రక్తం అందించడంలో జరిగిన పొరపాటుపై వివరాలు తెలుసుకున్నారు.
KRNL: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు.
W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ‘భారతదేశ జనాభా గణన 2027’ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
VZM: సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్కి వెళ్లి ZP సమావేశానికి హాజరు కాలేకపోతే దానిని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి MLAలు మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా అని శ్రీనివాసరావును మీడియా ముఖంగా ప్రశ్నించారు.
KDP: ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు శుక్రవారం మోటార్ సైకిల్ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల చోరీపై విచారణ చేపట్టి, స్థానిక నడింపల్లె వీధికి చెందిన షేక్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసినట్లు CI కొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు SIలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డిలను జిల్లా SP అభినందించారు.
ATP: అనంతపురం టీటీడీసీ భవనంలో సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు వార్షిక రుణ, జీవనోపాధుల ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.శైలజ పాల్గొని మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రణాళికలో 50 శాతం జీవనోపాధులు వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.
తూ.గో: తాళ్లపూడి మండలం తాడిపూడి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు నామా వెంకట సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రుచిత పాల్గొన్నారు.
KDP: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా 352 KGBVల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలు, 7-10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్ని KGBVల్లో కలిపి 32,079 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 69,362 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
PPM: క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించి, వ్యాప్తి చెందకుండా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా క్షయ విభాగపు సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శుక్రవారం ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ పాల్గొన్నారు.
కృష్ణా: పన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు ఆర్.సీపీ రెడ్డి గుడివాడలో నిన్న విమర్శించారు. 5% రిబేటు అని చెబుతూనే, ఏటా 15% పన్ను పెంచడం ప్రజలపై మోయలేని భారమని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. పెంచిన పన్నులను తక్షణమే తగ్గించాలన్నారు.
GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను 12 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా నివారణ చర్యలు, శుద్ధి త్రాగునీటి సరఫరా, జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.