NLR: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న కేసు విచారణలో ఇద్దరికి తుది తీర్పు వచ్చింది. 2021లో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎనిమిది కేజీల గంజాయిని తమిళనాడుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం జిల్లా కోర్టు ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.
CTR: పుంగనూరు నియోజకవర్గ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం అధ్యక్షులుగా వరదారెడ్డిని నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ATP: ఈ నెల 20న CM చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
TPT: శ్రీహరికోట నూతన ఎస్సైగా భాను నియమితులయ్యారు. ఆమె గతంలో నాయుడుపేట పట్టణ ఎస్సైగా పనిచేశారు. బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు. శ్రీహరికోట స్టేషన్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టి అరికడతానన్నారు.
GNTR: ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరూ కొంతసేపు పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించారు. అలాగే, పట్టణంలోని పలు రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
సత్యసాయి: పెనుకొండకి చెందిన కె.అనిత శ్రీనివాసులు కుమార్తె లహరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. ఆమె 972 మార్కులు సాధించి A గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించింది. లహరి సాధించిన ఈ విజయంపై పట్టణంలోని ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లహరిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అల్లవరం మండలం సముద్ర తీరం కొమరిగిరిపట్నం, ఓడరేవు ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలలో జేసీబీలతో తీర ప్రాంతాన్ని తవ్వేస్తున్నారని చెప్తున్నారు. దీని వలన తీర ప్రాంతం అంతా గోతులు పడుతున్నాయని, వీటి వలన ప్రాణహాని కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ELR: చింతలపూడిలో గురువారం స్వీయ గణన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.
CTR: ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థిని క్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. CEC విభాగంలో ముత్తుకూరుకు చెందిన క్యాతిప్రియ 491 మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు.
ATP: గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా చేపట్టారు. తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ పుణ్యవతికి అందజేశారు.
ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్వీయ గణన కింద తమ కుటుంబ సభ్యులు వివరాలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. జనార్ధన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జన గణన-2027’ ప్రక్రియలో భాగంగా స్వీయ గణన ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టర్లు వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద గల స్థలాన్ని గురువారం కొందరు భూకబ్జాదారులు జెసీబీతో స్థలాన్ని క్లీనింగ్ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్లీనింగ్ పనులను అడ్డుకున్నారు. ఈ స్థలం కొత్తపేట గ్రామపంచాయతీకి సంబంధించిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన నాగలక్ష్మి ఖతార్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కేసీఎం అధికారులు ఆమెను క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. ఫిబ్రవరి నెలలో ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఆమెను అక్కడ తోటి పనిమనిషి వేధించినట్లు నాగలక్ష్మి ఆరోపించింది. దీంతో అధికారులు ఏజెంట్తో మాట్లాడి ఆమెను గురువారం స్వదేశానికి రప్పించారు.
KRNL: తుగ్గలి మండలం సీజీ తండా పంచాయతీలోని చెరువు తండా గ్రామంలో రూ.26.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే శ్యాం కుమార్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఇవాళ ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గొంగటి సూర్యనారాయణ రెడ్డి అనే రైతు ముళ్ళ కంపకు నిప్పు అంటించడంతో ఎండవేడికి నిప్పులు గడ్డివాములపై పడటంతో గడ్డివాములు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా కాలిపోతున్న గడ్డివాములను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.