ASR: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పిల్లలు చనిపోవడాలు నివారించేందుకు కలెక్టర్ నిశాంతి సోమవారం కఠిన ఆదేశాలు జారీచేశారు. ప్రమాదకర కాలువలు, చెరువులు, జలపాతాలను గుర్తించి, రిస్క్ మ్యాపింగ్ చేసి శుక్రవారంలోగా ఐటీడీఏకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, వెదురు కంచెలు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
CTR: ఆటోలో మర్చిపోయిన సెల్ ఫోన్ తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ను సీఐ సోమశేఖర్ రెడ్డి అభినందించారు. పట్రపల్లెకు చెందిన యాస్మి వీకోట మార్కెట్ యార్డ్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు గోవింద్ నగర్కు చెందిన చంద్రశేఖర్ ఆటోలో ప్రయాణం చేసింది. ఆటో దిగే సమయంలో అందులో సెల్ ఫోన్ మర్చిపోయింది. దానిని గుర్తించిన అతడు పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.
GNTR: వడ్లమూడి వర్సిటీలో డ్రగ్స్పై అవగాహనకు ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏపీ ఈగల్ ఐజీపీ రవికృష్ణ సోమవారం పాల్గొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని ఆయన హెచ్చరించారు. వీటికి పెట్టే ఖర్చు ఉగ్రవాదులకు చేరుతోందన్నారు. నార్కో టెర్రరిజంపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ATP: కళ్యాణదుర్గం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన తమ్మప్ప(65) అనే వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో నిందితుడు చిన్నారులను టీవీ చూసేందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అకృత్యానికి పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
KDP: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు హెచ్చరించారు. సోమవారం సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె పంచాయతీ నిర్మలగిరి కాలనీలో సుమారు 3.50 ఎకరాల భూమిని ఆక్రమించారన్న సమాచారంతో MRO ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
W.G: భీమవరం UTF కార్యాలయంలో సోమవారం CITU అనుబంధ శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సు జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వాలు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జిల్లా కన్వీనర్ కళ్యాణి ప్రశ్నించారు. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు, ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నేత చింతపల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వులు మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్యారా లీగల్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారే పేరా లీగల్ వాలంటీర్స్ అని అన్నారు.
AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సబ్బవరం మండలం గొటివాడలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పి. సురేష్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు.
EG: ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో, ఏర్పాట్లన్నీ పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.
VSP: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సోమలింగం పాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాయిబాబా, స్కూల్ కమిటీ ఛైర్మన్ నాగ విశ్వేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు. జడ్పీ హైస్కూల్ పరిధిలో వారు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు.
KDP: సిద్ధవటంలోని జ్యోతి గ్రామంలో సోమవారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన ఉత్కంఠ భరితంగా సాగింది. గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో చాపాడు, ప్రొద్దుటూరు, నంద్యాల, అనంతపురం ప్రాంతాల నుంచి ఆరు జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలో ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లెకు చెందిన మార్తల వెంకటసుబ్బారెడ్డి ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి.
PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22 న నిర్వహించబోతున్న మెగా కోలాటం గిన్నిస్ బుక్ ప్రదర్శనకు విద్యార్థులను సన్నద్ధం చెయ్యాలని బలిజిపిట MEO-1సామల సింహాచలం సూచించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని హైస్కూల్ HMలు, PD లతో గూగుల్ మీట్ ద్వారా రెండో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్ నుండి 50 మంది విద్యార్థులతో ఒక టీంను తయారు చేయాలన్నారు.
ASR: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పిజిఆర్ఎస్ సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని కలెక్టర్ టీ. నిషాంతి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పిజిఆర్ఎస్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
AKP: ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో 2021లో మొదలైన జీవన్ మిషన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.
VZM: దాడితల్లి, సరే పోలమ్మ తల్లి అమ్మవారి పండుగలు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పారిశుద్య పనులు చేపట్టాలని బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె కార్యాలయంలో శానిటరీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి వార్డులో విజిబుల్ క్లినింగ్నెస్ ఉండేలా కాలువలు శుభ్రం చేయాలన్నారు.