VZM: జమ్మూ పడాలపేటలో ఉన్న బేతని మిషన్ చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడాలపేట, నారాయణపురం, బీసీ కాలనీ, జమ్మూ, ఆనందపురం కాలనీ, సింగపూర్ సిటీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనేక మంది క్రైస్తవులు ర్యాలీ సందర్భంగా స్తోత్ర గీతాలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
NDL: రుద్రవరం మండలం చిన్న కంబలూరులో సోమవారం రాష్ట్రస్థాయి న్యూ కేటగిరి వృషభరాజ్యముల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘గుడ్ ఫ్రైడే-ఈస్టర్’ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన క్రైస్తవ సంఘపెద్దలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు.
KRNL: తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డి గ్రామంలో ఇవాళ అన్నదమ్ముల మధ్య పొలం తగాదా కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. బోయ కొత్తికొండ రంగప్ప నాయుడు, వెంకటరాముడుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో రంగప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
E.G: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రూడా చైర్మన్, తూ.గో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలియజేశారు.
KDP: చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్రావు, తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు
ATP: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చిన్మయనగర్లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. లడ్డూ విషయంలో నివేదికలున్నా సీఎం చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేసి అపచారం చేశారని మండిపడ్డారు.
పల్నాడు: పెదకూరపాడులో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సమాధుల తోటలను పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే తమ పితరుల సమాధుల వద్ద అగరవత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. సుదూర ప్రాంతాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాదుల తోటలో కొంత సమయం గడిపి తమ పితరులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. కాగా నజరేయుడైన ఏసు పునరుద్దానుడై మూడవరోజు తిరిగి లేచాడని వారి నమ్మకం.
పల్నాడు: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్గా, ప్రజాస్వామ్యవాదిగా పేరు గడించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించారు.
కోనసీమ: మండపేట ఏడిద కొత్తపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జడ్పీటీసీ కురిపూడి భవాని రాంబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీ హరిబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం ఆయన కృషి చేశారన్నారు.
గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ములుకుదురు సమీపంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు దెబ్బతినగా, రెండు వాహనాల్లో ఉన్న పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
అనకాపల్లిలో ఉత్సాహం ఎప్పుడూ ప్రత్యేకమని జబర్దస్త్ ఫేమ్ ఆది అన్నారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన అనుభవం మరపురానిదని తెలిపారు. అమ్మవారి జాతరకు మళ్లీ రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసించారు.
ATP: గుత్తిలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొంది మానవాళి పాపాల్ని క్షమించడానికే భూమిపై మళ్లీ అవతరించారని పేర్కొన్నారు. ప్రేమ, సహనం, శాంతిని పంచిన కరుణామయుడు యేసుక్రీస్తు అని, ఆయన ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. ఈస్టర్డే వేడుకలు సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కాకినాడ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ను శనివారం సాయంత్రం పిఠాపురం మాజీ MLA వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వర్మ తెలిపారు.