PPM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, సరైన చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ELR: మొండి బకాయి దారులు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ వారు వసూళ్లు చేస్తున్న ఇంటి పన్నులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు వెంకట రవిచంద్ర కుమార్ పాల్గొన్నారు.
VSP: సీపీఐ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం సచివాలయాల వద్ద మంగళవారం ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… 20 నెలలైనా ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, అలాగే టిడ్కో ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వాసుదేవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ఛైర్మన్ సన్యాసిరావు, దేవాదాయ, రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు. ఇందులో ఆసక్తిగల భక్తులు పాల్గొనాలని కోరారు.
VZM: రాజాం పట్టణంలోని సారధి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, స్టాకును పరిశీలించారు. అనంతరం పిల్లలకు ఇస్తున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అలాగే, చిన్నారులతో మాట్లాడి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.
ASR: అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ పి. మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీబీ లక్షణాలు, నివారణ గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం చేపట్టారు.
AKP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పరవాడ, వాడ చీపురుపల్లి పీహెచ్సీలు సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కనక అప్పారావు మాట్లాడుతూ.. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కలిగే ప్రాణాంతక అంటువ్యాధి అని తెలిపారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
NLR: నెల్లూరు 46వ డివిజన్ చిన్న బజారు ప్రాంతంలో కమిషనర్ వై.ఓ.నందన్ మంగళవారం పర్యటించారు. మార్కెట్ ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలను పరిశీలించారు. నిబంధనలు దాటి వ్యాపారం చేసే వారిపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా డస్ట్ బిన్ వాడాలని, పరిశుభ్రత పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.
KDP: పులివెందులలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం భారీ క్యూ కనిపించింది. ఎండను లెక్కచేయకుండా గంటల తరబడి గ్యాస్ కోసం వేచి చూస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే నీటి సమస్యతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత ఇబ్బందిగా మారింది.
W.G: నరసాపురం(మం) చిట్టవరం గొందిలో జరిగిన ‘రైతన్న నీకోసం’ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు పాల్గొన్నారు. మత్స్యకార రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారులు, రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
CTR: వెదురుకుప్పంలో ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ రవికుమార్, ఎంపీడీవో పురుషోత్తం, ప్రజాప్రతినిధులు హాజరై ఉపాధి హామీ పనుల అమలుపై చర్చించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలో మంగళవారం సీపీఐ నాయకులు మస్తాన్వలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ నివేశ స్థలాలు ఇవ్వాలని, అలాగే సాగు చేసుకునేందుకు భూమి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ.. పేదల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం తాసిల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA లైసెన్స్ను 2031 వరకు కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడంపై గుత్తిలో బీఎస్పీ నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా ఉత్తర్వులు రావడం శుభపరిణామమని నియోజకవర్గ, మండల నాయకులు పేర్కొన్నారు. అనంతరం సంబరాలు చేశారు.
నంద్యాల: నవజాత శిశువులకు బీసీజీ వ్యాక్సిన్ వేయించడం వల్ల క్షయ వ్యాధిని అరికట్టవచ్చని డా.షాహలాం అన్నారు. మంగళవారం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహలాం మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ మహమ్మారిని అంతం చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.
E.G: కొవ్వూరు పట్టణ పరిధిలోని నందమూరులో విద్యుత్ షాక్కు గురై శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. కాగా రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.