• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

NLR: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి ఒంగోలు నుంచి భీమవరానికి బైక్‌పై వస్తున్న ఉలవపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే యువకుడు పాలేరు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుర్తించి అంబులెన్స్‌లో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 09:08 AM IST

దాడులు చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలోని గౌలిపేట కిందిగేరిలో ఇటీవల గాయపడిన బోయ రామును ఎమ్మెల్యే పార్థసారథి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నిరపరాధులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యువత అనవసర గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలకు ఇబ్బందులు కలిగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

March 22, 2026 / 09:04 AM IST

గ్యాస్ నౌక ఆలస్యం.. కిరోసిన్ పంపిణీ

VSP: హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖకు ఈ నెల 21న రావాల్సిన గ్యాస్ నౌక 26న చేరనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ ద్వారా లీటరు చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

March 22, 2026 / 09:00 AM IST

చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

GNTR: పొన్నూరు మండలం ములుకుదురులోని శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దాసరి సింగయ్య శనివారం విడుదల చేశారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

March 22, 2026 / 09:00 AM IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి : MLC

SKLM: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని PRTU కార్యాలయంలో ఉపాధ్యాయుల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెమో 57 అమలు, పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరుతూ పలు తీర్మానాలు చేశారు.

March 22, 2026 / 09:00 AM IST

భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

E.G: రాజమండ్రిలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. రవాణా ఖర్చులు, కోళ్ల దాణా రేట్లు పెరగడంతో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.380, స్కిన్‌తో రూ. 360కు చేరింది. లైవ్ కోడి రూ.230కు విక్రయిస్తున్నారు. మరోవైపు మటన్ ధర కిలో రూ.1100కు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో మాంసం కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 22, 2026 / 09:00 AM IST

రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

VZM: మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని పాల్గొనే వారికి శేషవస్త్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.

March 22, 2026 / 09:00 AM IST

పుష్పాలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఇవాళ అమ్మవారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు రుద్రాభిషేకం, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లలో నిల్చొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

March 22, 2026 / 08:53 AM IST

అభివృద్ధి పనుల్లో వేగం.. సీసీ రోడ్డు పనులు ప్రారంభం

BPT: పర్చూరు మండలం నూతలపాడులో గ్రామాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఎస్సీ కాలనీలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్, స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మద్దతుతో గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపర్చే దిశగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

March 22, 2026 / 08:53 AM IST

కల్తీ టీపై అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కల్తీ టీ పొడి విక్రయాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్‌లో నకిలీ టీ విస్తృతంగా అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఎమ్మెల్యే వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 22, 2026 / 08:53 AM IST

ఐయిదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని చౌడూరు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్ తెలిపారు. మొత్తం 5 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. అనుమతి లేనిచోట అక్రమంగా తవ్వకాలు చేసి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

March 22, 2026 / 08:52 AM IST

కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

అన్నమయ్య: రాయచోటి బైపాస్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

March 22, 2026 / 08:52 AM IST

సీపీఐ కాలనీలో ఆపరేషన్ వజ్రపహార్

సత్యసాయి: పెనుకొండలోని సీపీఐ కాలనీలో ‘ఆపరేషన్ వజ్రపహార్’ కింద పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ కెమెరా సహాయంతో గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అనుమానిత వ్యక్తుల యొక్క ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 22, 2026 / 08:45 AM IST

పశ్చిమ గోదావరికి రెడ్ అలర్ట్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

March 22, 2026 / 08:44 AM IST

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే తనిఖీలు

NLR: విడవలూరులోని వావిల్ల రోడ్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. లారీలు, గోన సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

March 22, 2026 / 08:40 AM IST