NTR: నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద “థీమ్ జీరో వేస్ట్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గ్రామ ప్రజలకు చెత్త సేకరణ, పరిశుభ్రత ప్రాముఖ్యత వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని సాయినగర్ కాలనీకి చెందిన వీరేష్ మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పన్నులు పెంచుతున్నా కాలనీలో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయని ఇవాళ విమర్శించారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.
AKP: అమరావతి రాజధాని కోసం మహిళలు 1,631 రోజులు సుదీర్ఘకాలం పోరాటం చేశారని హోం మంత్రి అనిత గుర్తు చేశారు. అమరావతి రాజధానిపై తీర్మానం కోసం సమావేశమైన శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రాజధానిపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించుకునే అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయిందన్నారు. అమరావతి కోసం చేసిన త్యాగాలు, పోరాటాలను గుర్తు చేశారు.
PPM: వినియోగదారుల్లో చైతన్యం పెంపొందితేనే నాణ్యమైన జీవితం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం గిరిమిత్ర భవనంలో మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ‘షైన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో కేవలం ధర, అందుబాటును మాత్రమే ఆధారంగా తీసుకోకుండా, వాటి నాణ్యత, బ్రాండ్, ప్రమాణాలను పరిశీలించాలన్నారు.
NLR: నగర పాలక సంస్థ పరిధిలో మొండి బకాయిలు ఉన్న వారు ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని శనివారం కమిషనర్ వై.ఓ. నందన్ కోరారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 4 రోజులు మాత్రమే గడువు ఉన్నందున కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. నగర అభివృద్ధి కోసం పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని కమిషనర్ తెలియజేశారు.
E.G: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షులు మోర్త ప్రమోద్ హర్షం వ్యక్తo చేశారు. నిడదవోలులో ఆయన శనివారం మాట్లడుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రజలపై భారం పడకూడదని నిర్ణయం తీసుకుందన్నారు.
SKLM: ఆమదాలవలస మండలం అక్కుల పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత పై ఆయన సమీక్షించారు. వైద్యులు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్లు మీనా కుమారి, వసంత పాల్గొన్నారు.
ATP: తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి కోరారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన నాయకులకు సూచించారు. టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
W.G: ఉండి మండలం చెరుకువాడలో శనివారం ఇసుక టిప్పర్ లారీ పంటకాలువలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడని అతనికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఆకివీడు వైపు నుంచి ఇసుక లోడ్తో ఉండి వైపు వెళుతూ లారీ బోల్తా కొట్టింది.
CTR: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. పలువురు వైసీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: రొద్దంలో మహిళలు, బాలికల భద్రతపై శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగంపై వివరించారు. సైబర్ క్రైమ్లు, ఫ్రాడ్ లోన్స్ మోసాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రేణుక, కానిస్టేబుల్ పోతన్న, హుస్సేన్ భాష పాల్గొన్నారు.
KDP: మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహానుభావుడని కొనియాడారు. ‘శివతాండవ కావ్యం’ వంటి అద్భుత రచనలతో తెలుగు సాహిత్యంలో అగ్రస్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు.
NDL: మహానంది మండలం అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తి టీం సభ్యులు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి తల్లి మొబైల్లో శక్తి యాప్ ఉండాలని హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సూచించారు. సైబర్ నేరాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ప్రకాశం: అర్ధవీడులోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఎస్సై శివ నాంచారయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు. అలాగే, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు.
BPT: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బాపట్ల పట్టణంలో పోలీసులు “నో హెల్మెట్-నో ఫ్యూయల్” కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.