KDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా నీచ రాజకీయాలకు వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో భూతులు మాట్లాడిన వారికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భూపేష్ రెడ్డి అన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతానగరం ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలో శనివారం విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని సరుకుల నిల్వలను, స్టాక్ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో చూపిస్తున్న సరుకు నిల్వలకు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నిల్వలకు ఏమాత్రం పొంతన లేదని దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
TPT: సత్యవేడులో నిర్వహించిన పంచాయతీ సెక్రటరీల శిక్షణలో ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీ సొంత ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సూచించారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెరువుల వేలం, సంతలు, భవన అనుమతులు, లైసెన్సులు, అద్దెలు వంటి మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రభుత్వ గ్రాంట్లపై మాత్రమే ఆధారపడకుండా పన్నులు సకాలంలో వసూలు చేయాలని అన్నారు.
KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమం శనివారానికి 98వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల మోనోభావాలను కూటమి ప్రభుత్వం గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన పోరాటంపై నిర్లక్ష్యం తగదని, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని JAC నాయకులు కోరారు.
E.G: కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామానికి చెందిన ఆకుల రాజకుమారికి వైద్య ఖర్చులకోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసర సమయంలో బాధితులకు ప్రభుత్వం తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు.
NLR: ఇందుకూరుపేట పంచాయతీలోని శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ దేవతల మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ATP: అనంతపురంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 25 లక్షల విలువైన 143 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో ఒకరైన బాష @ కురుబ రామాంజినేయులు పాత నేరస్థుడని, అతనిపై 15 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
VZM: స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ కింద శనివారం రాజాం పురపాలక సంఘ పరిధిలో పోలిపల్లి అమ్మవారి గుడి దగ్గర నుంచి బొబ్బిలి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శుభ్రతను ప్రోత్సహించి, చెత్త లేని పరిసరాలను సాధించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు తెలిపారు.
W.G: ఆకివీడులో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ 165లోని పలు రహదారులను ఆయన పరిశీలించారు. స్థానిక అధికారులతో చర్చించారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణ రాజుతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్ తహశీల్దార్ ఫరూక్, ఆర్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.
SKLM: శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జయదేవ్ పాల్గొన్నారు.
VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంఆర్డీఏలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఉద్యోగ్ భవన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను ఉద్యోగులు తొలగించి శుభ్రపరిచారు. అనంతరం కార్యదర్శి మురళీకృష్ణ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
KDP: జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ ఉత్తర్వుల మేరకు SDPO వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ కాలనీలో ఉదయం 4.30 గంటల నుంచి సోదాలు చేపట్టారు. స్వాధీనం చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
E.G: శాసనమండలిలో వైసీపీ MLCలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలు పట్టుకోవడం అత్యంత అపచారమన్నారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
AKP: ఎలమంచిలి పట్టణం ధర్మవరం ప్రాంతంలో శనివారం పర్యటించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మురికి కాలువలను పరిశీలించారు. తక్షణం కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డ్రైనేజ్పై అనధికారికంగా ఉంచిన పలకలను తొలగించాలని ఆదేశించారు. గత పాలకులు డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపట్టలేకపోయారన్నారు.
ELR: కొబ్బరికాయలు ధరలు పడిపోకుండా చర్యలు చేపట్టి కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరులో ఆయన మాట్లాడారు. ఇటీవల కేంద్ర,రాష్ట్ర బడ్జెట్లలో కొబ్బరి సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని గుర్తు చేశారు.