విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 170 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తొలగించారు. ఎంతోకాలంగా సేవలందిస్తూ వచ్చిన తమను ఈ విధంగా తొలగించి 10 రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే కోర్టు తమను తొలగించిందని వారు పేర్కొన్నారు.
కృష్ణా: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ శివారుతోట మూల మూలమలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఓ లారీ బోల్తా కొట్టింది. స్థానికుల వివరాల మేరకు.. మూలమలుపు కావడంతో డ్రైవర్కు రూట్ తెలియకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లారీ డ్రైవర్ బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం, నారాయణ సోత్రం పారాయణం గావించారు.
నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగుచేసిన పంటలు దెబ్బతిని పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పెంగల్ తుఫాను వల్ల కంది, శనగ పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు పొగ మంచు వల్ల సెనగ, కంది పంటలు మరింత దెబ్బతిన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
CTR: పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం చోరీ జరిగింది. పూజారి మల్లికార్జున ఉదయం 6గంటలకు ఆలయ ప్రధాన గేటుకు తాళాలు తీసి వచ్చేశారు. గర్భగుడి తాళం తీయలేదు. సాయంత్రం ఆలయానికి వెళ్లగా లోపలి హుండీ పగలకొట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని కానుకలతో పాటు అమ్మవారి నాలుగు తాళిబొట్లు చోరీ అయినట్లు పూజారి తెలిపారు.
TPT: శ్రీకాళహస్తిలో కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని ఆయన అధికారులను నిలదీశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. తమను మాజీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో తిట్టారంటూ టౌన్ ప్లానింగ్ అధికారిణి శారద వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది.
CTR: సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1985-86 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పాఠశాలలో సమావేశమయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. అనంతరం గురువులను సన్మానించి.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తరచూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
NDK: మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ సమీపంలోని మరకతలింగేశ్వరుడికి మంగళవారం ఘనంగా రుత్వికులు పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణదాత, శ్రీకృష్ణ జ్యోతిష్యాలయం అధినేత కనుమర్లపూడి మస్తానరావు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో రుత్వికులు గణపతిపూజ, పుణ్యాహవచనంతో పాటు రుద్రాభిషేకం పూజలను వేదమంత్రాలతో నిర్వహించనున్నారు.
SKLM: సరుబుజిలి మండలం కొత్తకోట గ్రామంలో ఆదివారం రాత్రి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. అంబల్ల రాంబాబు, సురవరపు జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో విజేతల టీములకు ఫస్ట్ ప్రైస్ కొర్లకోటకు రూ.10 వేలు, సెకండ్ ప్రైజ్ ఎల్ కొత్తూరు రూ. 8 వేలు. థర్డ్ ప్రైస్ కృష్ణాపురం టీం రూ. 6 వేలు బహుమతులు అందజేసినట్లు తెలిపారు.
NLR: పెళ్లకూరు మండలంలో ఓ వ్యక్తిపై పోక్సోకేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో మూడు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సుధాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గుర్తించి మందలించారు. చిన్నారి తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ: సింహాచలం దేవస్థానానికి సంబంధించి పంచ గ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి సింహాచలంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనిపై సింహాచలం ఛైర్మన్ అశోక్ గజపతిరాజుతో పాటు పలువురుతో చర్చించినట్లు తెలిపారు.
అన్నమయ్య: అనారోగ్యం తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తంబళ్లపల్లె మండలం కోటకొండ వడ్డిపల్లికి చెందిన హరిబాబు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రులలో చూపించి మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు నయం కాలేదు. దీంతో ఆదివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
KRNL: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్నస్వామి సన్నిధిలో నేడు రుద్ర హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విజయరాజు తెలిపారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతినెలా రుద్ర హోమం చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులు సేవ రుసుం రూ. 1500 చెల్లించి హోమంలో పాల్గొన్న సేవా భక్తులకు ఆలయ తరపున శేషవస్త్రం, రెండు లడ్డూ ప్రసాదాలు అందిస్తామన్నారు.
కడప: రామసముద్రం – చంబకూరు రోడ్డులోని శనీశ్వర ఆలయం వద్ద భారీ చింత చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలింది. ఒక పక్క కొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలు స్తంభించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
KRNL: మద్దికెర మండలంలోని పెరవలిలో వెలసిన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో సంవత్సరం పాటు టెంకాయలు, తమలపాకులు అమ్ముకునేందుకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో షీల్డ్ కొటేషన్, బహిరంగ వేలం ఈ నెల 20వ తేదీ ఉదయం 10: 30 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహిస్తామని ఈవో వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల పాటదారులు రూ. 50 వేలు ధరావత్తు చెల్లించి వేలాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.