TPT: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ టికెట్ కౌంటర్ సిబ్బంది కుట్టి బాబును ఆలయ ఈవో పెంచల కిషోర్ సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా, సరైన సమాధానం చెప్పకుండా అగౌరవపరచారని చెప్పారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
TPT: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిద రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంట్ జీరో అవర్లో గళమెత్తారు. ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మూడవ రైల్వే లైన్ త్వరగా పూర్తి చేయాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు.
W.G: జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం ప్రకాశం చౌక్ నుంచి పీపీ రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం వరకు విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తులో విద్యుత్ సమస్య ఉండదన్నారు.
ATP: అనంతపురం నగరంలో సోమవారం ఉదయం RTC రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజును TNSF జిల్లా ఉపాధ్యక్షుడు కప్పల నరేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ విద్యార్థల కోసం పలు గ్రామాలకు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆయనను కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు TNSF నేతలు పాల్గొన్నారు.
సత్యసాయి: కలెక్టర్ టీఎస్ చేతన్ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఇంధన పరిరక్షణపై రూపొందించిన గోడ పత్రికలు, కరపత్రాల ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్ఏ విజయ సారధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.
KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించారు. సోమవారం పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీరమణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలు భూమికి సంబంధించిన సమస్యలను వినతులు అందించారు.
ప్రకాశం: ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి, కొండపీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ చెప్పారు. సింగరాయకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందన్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణం బంటుమిల్లి మెయిన్ రోడ్డుకు సోమవారం మరమ్మతులు నిర్వహించారు. నిత్యం వేలమంది ఈ రోడ్డు మీద ప్రయాణిస్తుండడంతో మెయిన్ రోడ్డుకు గుంతలు ఏర్పడి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తమ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే రాము పట్ల స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: గుత్తి పట్టణం బెస్తవీధిలో సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కొత్త తాగునీటి పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. బెస్త కాలనీలో తాగునీటి పైప్లైన్ డ్యామేజ్ కావడంతో తాగునీటి కోసం కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్కు తాగునీటి సమస్య గురించి విన్నవించారు. కమిషనర్ నూతన పైప్లైన్ ఏర్పాటు చేయించారు.
E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు టాస్క్ ఫోర్స్, కార్మిక శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాల కార్మికుల తనిఖీ, విముక్తి దళంను అడిషనల్ ఎస్పీ ఎన్. మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. బాల కార్మికులను గుర్తించి వారిని చదివిస్తామన్నారు.
NDL: చాగలమర్రి మండలం చక్రవర్తి పల్లె గ్రామం నందు విజయ పాల డైరీ ప్రెసిడెంట్గా టీడీపీ యువ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విఖ్యాత్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి విజయ డైరీ ప్రెసిడెంట్గా ఉండడం జరిగిందని, మళ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు బయటపెడతానని అన్నారు.
NLR: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో విద్యుత్ A.Eకి వినతి పత్రం అందజేశారు.
కోనసీమ: అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కలెక్టర్ మహేశ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సమస్యలు తెలియజేయడానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధుల వద్దకు ఆయన నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబందిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.
W.G: ఆచంట మండలం నుంచి నీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నాయకులు హరి సత్యనారాయణ, బలుసు సత్యనారాయణ మూర్తులను సోమవారం మార్టేరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరామకృష్ణ, ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం దక్షిణ చిరువోలులంక గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం(35) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.