ATP: మహిళల భద్రతకు భరోసా అయిన “శక్తి” యాప్ పై విస్తృతంగా శక్తి బృందాలు అవగాహన కల్పించాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా “శక్తి” యాప్ పై సోమవారం సాయంత్రం, వివిధ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్టాండ్లు, తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలకు, మరియు విద్యార్థినిలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు BPS-LRS స్కీంలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సోమవారం పిలుపునిచ్చారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలు, అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. BPSకు మార్చి 11 వరకు, LRSకు ఏప్రిల్ 23 వరకు గడువు ఉందన్నారు.
SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నిర్వహించిన సాంప్రదాయ ఊరేగింపు, బియ్యం ఆశీర్వచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి. సింగపూర్ భక్తులు ప్రదర్శించిన సంగీత విభావరి ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ చక్రవర్తి, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.
ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 113 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే 39 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండల PHC వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. PHC ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంతంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
W.G: మొగల్తూరులో ప్రసిద్ధి గాంచిన మామిడి ఫలసాయాన్ని వేలం వేసుకునేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మామిడి రైతులు, వర్తకులు సోమవారం అధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీవో త్రిశూల పాణి, తహసీల్దార్ రాజ్ కిషోర్కు వినతిపత్రం అందజేశారు. మామిడి విక్రయాల కోసం వేలం కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
NDL: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు ఎంపీ డా. బైరెడ్డి శబరి, కలెక్టర్ జి.రాజకుమారి సహకారంతో సోమవారం సాగునీరు విడుదల చేయించారు. మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని విడుదల చేయగా.. పంటలు రక్షించబడ్డాయని రైతులు ఎంపీ, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: గరికపాడు గ్రామంలో సోమవారం రాత్రి పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అక్కడ నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల కోసం ఏప్రిల్ నెలలో రూ. 20 లక్షలు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాను, కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ కళాశాలలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 302 మంది పరీక్ష రాయగా 294 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జవాబు పత్రాల పునఃమూల్యాంకన కోసం ఈ నెల 27లోపు ఒక్కో పేపర్కు రూ.1860 చెల్లించాలన్నారు.
NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన నష్టాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
BPT: పంగులూరు మండలం ముప్పవరంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన 91 మందికి మొత్తం రూ. 77.33 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
SKLM: మెళియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో ఎల్లమ్మ (జామి) జాతర ఇవాళ ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
VZM: చీపురుపల్లిలో జరుగుతున్న కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర పురస్కరించుకుని వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజా సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారికోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసామని, మంగళవారం కూడా భక్తులు అమ్మవారి దర్శనాలు, మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.
NDL: వెనుకబడిన రాయలసీమను 12 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చాగలమర్రిలో నాయకులతో కలిసి మాట్లాడారు. దశాబ్దాలుగా పాలకులు సీమకు అన్యాయం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేశారు.