BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.
GNTR: రాజధాని అమరావతిలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం కూడా పర్యటించింది. తాడేపల్లి మండలం ఉండవల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ఏడీబీ అధికారులు ఈ పర్యటన ద్వారా పూర్తి అవగాహన చేసుకున్నారు.
NDL: మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. MPHEO హుస్సేన్ రెడ్డి, తదితరులు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలను సేకరించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో మహిళపై ఓ వ్యక్తి రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన హేమలత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాళ్లతో దాడి చేసినట్లు బాధితురాలు తెలిపింది. గాయపడ్డ మహిళను స్థానికులు వెంటనే కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కృషితో దశాబ్దాల నాటి బ్రిడ్జి కల సాకారమవుతోంది. కన్నెపల్లి నుంచి భూపసముద్రం మధ్య హగరి నదిపై రూ.30 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఏడు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
SKLM: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సంఘం పిలుపుమేరకు అన్ని తాలూకా కేంద్రాలలో ఈనెల 26, 27 తేదీలలో ధర్నా నిర్వహించిన ప్రధాన కార్యదర్శి తిరుమలరావు, అధ్యక్షులు శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ PRC కమిషన్ను నియమించాలి, 30% ఐఆర్ను ప్రకటించాలి, నాలుగు విడతల పెండింగ్ డిఏలను ప్రకటించాలన్నారు.
AKP: అధిక పాల దిగుబడికి రైతులు మేలుజాతి పశువులను ఎంపిక చేసుకోవాలని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సూచించారు. రాంబిల్లి మండలం దిమిలిలో బుధవారం పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో నిర్వహించిన లేగ దూడల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతి అయిన పశువులను ఉత్పత్తి చేయవచ్చునన్నారు.
VZM: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో పార్టీ భావజాలన్నీ, సిద్ధాంతాలుకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్దానిక BC కాలనీలో మాట్లాడుతూ జనసేన సభత్వ నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నామని, సబ్యత్వ రెన్యవల్, లేదా నూతన సబ్యత్వానికి 9573838144 నెంబరుకు సంప్రదించాలని సూచించారు.
KDP: పెద్దముడియం మండలం అంటే బాంబులు, కత్తులు ఫ్యాక్షనే గుర్తుకొస్తుంది. కానీ పెద్దముడియంలో పురాతనమైన కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పాలెగాళ్ల కాలం నాటి బురుజులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బురుజుకు దాదాపు 300 సంవత్సరాల క్రితం కట్టించారు. పూర్వంలో శత్రువులు తమ ఊరిలోకి వస్తే ఆ బురుజులో నుంచి శత్రువులను గుండ్రాళ్లతో తరిమికొట్టేవారు.
NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామానికి చెందిన దారా ప్రదీప్ అనే యువకుడు ఇటీవల గనిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1లక్ష మంజూరు కావడంతో వాటిని టీడీపీ నాయకుడు రామేశ్వర్ రెడ్డి బాధితునికి అందజేశారు.
GNTR: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందించాలని బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అసెంబ్లీలో కోరారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు 2 వేల మంది ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారని ఆమె సభ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం వారి కుటుంబాలను ఆదుకునేలా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు.
PLD: నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం ఉదయం పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో 80 మంది సిబ్బంది, 6 బృందాలుగా విడిపోయి ఊర్ని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 బైక్లు, ఒక ఆటోతో పాటు కొన్ని కత్తులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టారు.
VSP: విశాఖ పరిసరాల్లో పోర్టుల కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోంది. గంగవరం పోర్టులో ఇనుప ఖనిజ మిశ్రమ కేంద్రం ఏర్పాటుతో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విశాఖ, గంగవరం, నక్కపల్లి పోర్టుల నుంచి బొగ్గు, ఇనుప ఖనిజ రవాణాతో గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు గిరి ప్రదక్షిణ, సాయంత్రం 4 గంటలకు పూలంగి సేవ, రాత్రి 7 గంటలకు అంకురార్పణం జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
AKP: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.