అనకాపల్లి: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్సీపట్నం గురుకుల పాఠశాలలో బాలురు, అచ్యుతాపురంలో బాలికలకు 5వ తరగతి, 6, 7, 8 తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
KDP: బలపనూరు 132/33 కేవీ సబ్స్టేషన్లో అత్యవసర పనులు చేయనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహరించాలని ఆయన కోరారు.
KKD: అన్నవరం కొండపై రామాలయం వద్ద సోమవారం 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దేవస్థానం అధికారులు అతడిని 108 వాహనంలో తుని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడని అన్నవరం పోలీసులు తెలిపారు. మృతుని మెడలో జంధ్యం, తువ్వాలు ఉన్నాయి. అతని వివరాలు తెలిసిన 9440796530 నెంబర్ కు తెలియజేయాలన్నారు
చిత్తూరు: పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బసవరాజ బాలికల, బాలుర కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 332 మంది విద్యార్థులకు గాను 318 విద్యార్థులు హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర నాయుడు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మైనారిటీల సంక్షేమంపై ఆయన గళమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలకు కేటాయించిన నిధుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, క్షేత్రస్థాయిలో ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
GNTR: పాతగుంటూరు నందివెలుగు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట అడ్డాపై సోమవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు 11 మంది జూదగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి దగ్గర రూ. 80వేల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
NLR: చికెన్ వ్యర్ధాలను వినియోగిస్తున్నారని చేపల గుంటలకు కరెంటు సరఫరాను మత్సశాఖ అధికారులు నిలిపివేయించిన ఘటన బుచ్చిలో చోటుచేసుకుంది. కాగులపాడు గ్రామాలలో మత్స్యశాఖ జేడీ కే శాంతి చేపల గుంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. 9 మంది రైతులు కోళ్ల వ్యర్ధాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి డ్రమ్ములు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3, సిట్టింగ్ 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి.
అనకాపల్లి: అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. 93,056 మంది నిరక్షరాస్యలను గుర్తించామన్నారు. వీరికి చదువు చెప్పేందుకు 9,351 మంది వాలంటీర్లను నియమించామన్నారు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించాలన్నారు.
తిరుపతి: శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి తిరుపతి-నాయుడుపేట బైపాస్లో బ్రీత్ అనలైజర్తో తనిఖీలు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ జానయ్య మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 12 రోజులు జైలుశిక్ష విధించారు.
ATP: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ బిల్లులను ప్రత్యేక శ్రద్ధతో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జేసీ విష్ణు చరణ్తో కలిసి పలు పథకాలపై సమీక్షించారు. జిల్లాలో మిగిలి ఉన్న 44.48 కోట్ల రూపాయల బిల్లులను మార్చి 10వ తేదీలోపు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
NLR: కర్నూలులో న్యాయవాది పవన్ కుమార్పై అక్కడి 4వ నగర పట్టణ సీఐ దాడిని ఖండిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. న్యాయవాదులంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
W.G: నరసాపురంలో అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14వ వార్డుకు చెందిన మహమ్మద్ రెహినాకు, మహమ్మద్ షబ్బీర్ 2021 జూన్ 28న వివాహం జరిగింది. పెళ్లైన మరుసటి రోజు నుంచే భర్త షబ్బీర్, మహమ్మద్ నసీమా, మహమ్మద్ నసీర్, మహమ్మద్ జబీన్, సందీప్ రెడ్డి అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులుల తెలిపారు.
NDL: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి 1న కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, విద్య, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరగనుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు.
అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని చిన్నవరం పాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు రవి మృతి చెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. సాయంత్రం పొలానికి వెళ్తున్న రవి సైకిల్ అదుపుతప్పి పడిపోగా, వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.