కాకినాడ: సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మార్ని చిలకమ్మ అనే ఒక మహిళకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
KDP: VN పల్లె మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు గురువారం పెరటి కోళ్ల పంపిణీ చేయనున్నట్లు DRDA. APM భాగ్యమ్మ బుధవారం తెలిపారు. మండలానికి 30 యూనిట్లు మంజూరు అయ్యాయని, ఒక్కో యూనిట్ విలువ రూ.3,700 అని ఆమె తెలిపారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవాళ VN పల్లె, ఉరుటూరు గ్రామాలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో 2026-27 విద్యా సంవత్సరానికి యోగ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఒక ఏడాది కాలపరిమితి ఉండే డిప్లొమా ఇన్ యోగ, పీజీ డిప్లొమా ఇన్ యోగ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వివరాలకు https://www.spmvv.ac.in వెబ్సైట్లో చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 10 అని పేర్కొన్నారు.
కోనసీమ: జిల్లాలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్కి ఏ విధమైన కొరత లేదని, గతంలో మన జిల్లా వినియోగం ఎంతైతే ఉందో అంత పెట్రోల్, డీజిల్ స్టాక్లు బంక్లకు వస్తున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కంగారుపడి ఎక్కువ ఆయిల్ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని కోరారు.
KRNL: 2026-27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ పెంపు ఉండదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి తెలిపారు. కర్నూలులో APERC విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంపిణీ సంస్థలు సూచించిన లోటును తగ్గించి, భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. గృహ,వ్యవసాయ వినియోగదారులకు ఎలాంటి అదనపు భారం లేదన్నారు.
కడప: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు.
GNTR: నగరంలో గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ, ఎస్పీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. డీజీపీ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
SS: విదేశీ పక్షుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. చిలమత్తూరు మండలం వీరాపురంలో సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమకూరుస్తామన్నారు. పక్షి పిల్లల సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని, ఎన్జీవోల సహకారం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, వాచ్ టవర్ ఏర్పాటు చేశామన్నారు.
ATP: శింగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. గురువారం హెచ్ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కాలువల మరమ్మతులు, చెరువుల నింపుదలపై చర్చించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీఎస్సీ, టీబీసీ కాలువల్లో నీటి లీకేజీల నివారణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
BPT: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సహకారంతో కేవీఆర్ అండ్ కేవీఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ఖాజీపాలెంలో ఈ నెల 31న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి ఈ విషయం తెలిపారు. 20 బహుళజాతి కంపెనీల్లో 1200 ఉద్యోగాలకు యువతను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
SKLM: జిల్లాలో 22ఏ భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎమ్మార్వోలకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు 22 ఏ పట్ల అలసత్వం వహించరాదని తెలిపారు.
VSP: వేపగుంటలో వుడా, దేవస్థానం భూ సమస్య ఎదుర్కొంటున్న రైతులతో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఇవాళ సమావేశమవుతారు. ఉదయం 9 గంటలకు వేపగుంటలో వినాయకుడి గుడి వెనుక ఉన్న జీవీఎంసీ సామాజిక భవనంలో ఈ సమావేశం జరుగుతుంది. రైతులంతా పాల్గొని తమ సమస్యను ఎమ్మెల్యేకు వివరించుకోవాలని మాజీ కార్పొరేటర్ బల్ల శ్రీనువాసరావు తెలిపారు.
AKP: జిల్లాలో రెండు దశల్లో జనగణన జరుగుతుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బుధవారం అనకాపల్లి శంకరన్ భవన్లో నిర్వహించిన జనగణన శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనగణన చేపట్టాలన్నారు. మొదటి దశలో బ్లాక్ల వారీగా గృహాలు లెక్కింపు జరుగుతుందన్నారు. రెండవ దశలో వచ్చే ఏడాది జనగణన నిర్వహించాలన్నారు. ఎలక్ట్రానిక్ విధానంలో జనగణన జరుగుతుందని ఆయన తెలిపారు.
SKLM: జలుమూరు మండలంలోని సర్పంచులను మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి గ్రామస్థాయిలో గౌరవప్రదమైనదని, గ్రామ స్వరాజ్య స్థాపనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోన్నారు. మరికొద్ది రోజులలో సర్పంచ్ పదవీకాలం ముగియడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కోనసీమ: రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో బుధవారం సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఉదయం 9.45 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న మందు విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.