తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. తన బీఆర్ఎస్ పార్టీని… పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో విస్తరించే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సంగతి పక్కన పెడితే… పాలకులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అధికార పార్టీతో పాటు… ప్రతిపక్ష పార్టీలు కూడా.. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు.సెంటిమెంట్ పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించి, ఏపీకి అన్యాయం చేసి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అడుగు పెట్టటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్రం కోరుకొనే వారు రాజధాని కట్టుకోవాల్సి ఉంటుందని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా హైదరాబాద్ తెలంగాణకు కేటాయించి ఏపీకి అన్యాయం చేసిందన్నారు. అసంబద్ద రాష్ట్ర విభజన కారణంగా నష్టోయిన ఏపీ ఇప్పటికీ కోలుకోలేదని పేర్కొన్నారు. ఏపీలో రాజకీయం కోసం వస్తే ప్రజలే బీఆర్ఎస్ కు బుద్ది చెబుతారంటూ మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు చేసారు.
అయితే… రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన తండ్రిగా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు వెళ్తున్న సమయంలోనూ నగరిలో రోజా ఇంటికి వచ్చారు.
రోజా ఆ సమయంలో ఆయనకు ఘన స్వాగతం ఏర్పాటు చేసారు. తిరుగు ప్రయాణంలో రోజా ఇంట విందు స్వీకరించారు. కుటుంబ సభ్యుల రోజాతో ఆప్యాయంగా వ్యవహరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసారు. పలు సందర్భాల్లో కేసీఆర్ పైన తన అభిమానం చాటుకున్న రోజా ఇప్పుడు ఏపీలో ఆయన పార్టీ పెట్టేసరికి ఇలా విమర్శించడం అందరినీ విస్మయానికి గురి చేయడం గమనార్హం.