KNR: కరీంనగర్లో ఆదివారం రాత్రి రాష్ట్రస్థాయి సీఎం కప్ 2026 జిమ్నాస్టిక్స్ అండ్ ఆర్టిస్టిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాల జిమ్నాస్టిక్స్ ప్రాంగణంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గసిరెడ్డి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.
BDK: జూలూరుపాడు మండలంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మైదానాలు నిర్వహణ లోపంతో పాడైపోతున్నాయి. వ్యాయామం, వాకింగ్కు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో యువత దూరమవుతోంది. పిచ్చిమొక్కలు, చెత్తతో మైదానాలు దెబ్బతినగా, వెంటనే అభివృద్ధి చేయాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
SDPT: కొమురవెల్లిలో చేర్యాల సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు అదనపు బలగాలతో ‘ప్లాగ్ మార్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
BHNG: జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీ-సర్వే చేపట్టింది. భువనగిరి చందుపట్ల, బొమ్మలరామారం మునిరాబాద్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ప్రతి ఇంచు భూమికి హద్దులు నిర్ణయించి, రైతులకు ‘భూధార్’ కార్డులు జారీ చేస్తారు. త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ విస్తరించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
కృష్ణా: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రితో కలిసి దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, వచ్చే రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.
PDPL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2025- 26 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని అక్షిత ప్రతిభ చాటింది. బాక్సింగ్ అండర్-60 వెయిట్ కేటగిరీలో పోటీపడి రజత పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓదెల ఎంఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.
NGKL: పుట్టగానే కులోన్మాదానికి బలైతానని పాపం ఆ బిడ్డకు ఏం తెలుసు?, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ నేడు కానరాని లోకాలకు వెళ్లింది. 9 నెలలు మోసిన ఆ తల్లి కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో. ఫులే, అంబేడ్కర్ లాంటి మహనీయులు ఎంత మంది పోరాడినా ఇప్పటికీ కుల వివక్ష ప్రాణాలు తీస్తోందన్న దానికి కుమ్మెర ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
MLG: కన్నాయిగూడెంలో దేవాదుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాల వివాదానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని తెలిపారు.
JN: చిల్పూర్ మండలంలోని లూనావత్ తండాకు చెందిన గుగులోతు సురేష్ (24) కొబ్బరి చెట్టు నుంచి కింద పడి మృతిచెందాడు. కొబ్బరిచెట్టు ఎక్కి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.
KMM: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దరఖాస్తులు కోరారు. గత ఐదేళ్లలో 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, అందులో 50% మంది మొదటి శ్రేణిలో నిలిచిన రాష్ట్ర/కేంద్ర గుర్తింపు పొందిన పాఠశాలలు దీనికి అర్హులన్నారు.
SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని కోళ్ల షెడ్లలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్లు చనిపోతున్నాయని అనుమానిస్తున్న యజమాని, జెసిబితో గుంతలు తీసి వాటిని పాతిపెట్టారు. అయితే, వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PDPL : గోదావరిఖని బెడెన్ పావెల్ పార్కులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు, బెడెన్ పావెల్ 169వ జన్మదినం, ‘వరల్డ్ థింకింగ్ డే’ ఆదివారంఘనంగా నిర్వహించారు. RG-1 SO to GM చంద్రశేఖర్ పావెల్ విగ్రహానికి నివాళులర్పించి, స్కౌట్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 200 మంది విద్యార్థులతో ‘శాంతి ప్రగతి యాత్ర’ చేపట్టారు. స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.
NZB: రాష్ట్రస్థాయి సీఎం కప్ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో పూల్ విన్నర్గా నిలిచింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ల్లో నిజామాబాద్ క్రీడాకారిణులు వరుస విజయాలు సాధించారు. హనుమకొండ, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల జట్లను మట్టికరిపించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
HNK: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల పాలిట వరంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. 45వ డివిజన్ పరిధి లోని కడిపికొండకు చెందిన దామెరుప్పుల సురేష్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2,50,000/-చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.