ASF: వాంకిడి మండలం ఖీరిడి గ్రామ ZPSS పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియా, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు వివరించారు.
GDWL: రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరిగా చేసుకోవాలని ధరూర్ మండల ఏఈఓ స్వరూప సూచించారు. పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులంతా నమోదు పూర్తి చేయాలని కోరారు. రిజిస్ట్రీ చేసిన వారికే ప్రభుత్వం నగదు జమ చేస్తుందని తెలిపారు. వివరాలు నమోదు చేయని అర్హులైన రైతులకు ఆర్థిక సాయం నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు.
MBNR: బాలానగర్ మండల సర్పంచుల సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. పోచమ్మగడ్డ సర్పంచ్ జె.కుమార్ నాయక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సునీత, చెన్నమ్మ, శ్రీను, కోశాధికారులుగా జంగమ్మ, వసంత, అరుణ, రాజు, వెంకటేష్ నాయక్ ఎన్నుకోబడ్డారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
BHPL: రేగొండ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడు పసుల రాజుకు భాగిర్తిపేట గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల తిరుపతి గౌడ్ రూ. 5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదని పేర్కొన్నారు.
JN: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడికందుల సదానంద చారి అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉండగా,వారసుడు అంటే కేవలం కొడుకే కాదు కూతురు కూడా అని నిరూపిస్తూ పెద్ద కూతురు ముందుకు వచ్చి తండ్రి పార్థివ దేహానికి తలకొరివి పెట్టింది. గ్రామస్థులు ఆమె ధైర్యాన్ని అభినందించారు.
KMR: ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం తుప్పు పట్టిన 5 వాహనాలకు నిర్వహించిన వేలంలో 10వేల రూపాయల ఆదాయం వచ్చిందని స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి. షాకీర్ అహ్మద్ తెలిపారు. కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ. హనుమంతరావు ఆదేశాల మేరకు గత 12సంవత్సరాల క్రితం NDPS కింద పట్టుబడిన 5 తుప్పు పట్టిన వాహనాలకు వేలం నిర్వహించడం జరిగింది.
KMM: భూదానం భూములపై సమగ్ర విచారణ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వెల్లడించారు. నిజంగా నిరుపేదలే ఉన్నారా లేదా అని అంశంపై రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డబ్బులు వసూలు చేసి ప్లాట్లు విక్రయించిన వ్యక్తులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 15 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై గ్రామ సర్పంచ్ అనూష DLPOకు బుధవారం ఫిర్యాదు చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో రూ. 1,75,703 అక్రమంగా విడుదల చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలకవర్గం, తనకు తెలియకుండా ఫిబ్రవరి 21న హాజరు పట్టికలో సంతకం పేరుతో కార్యదర్శి రజియా మోసం చేసినట్లు సర్పంచ్ ఆరోపించారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
KMM: వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147,148,149 భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీన చర్యలు పూర్తిగా చట్టబద్ధమైన వని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ తెలిపారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు 250 కోట్లకు పైగా ఉంటుందని భారీ స్థాయి ఆస్తులను కాపాడగలిగామని ఆయన తెలిపారు.
NZB: ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్ కృత్రిమ రంగులవాడుతున్నట్లు గమనించామన్నారు.