KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ధర్మకర్తలు, అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు.
PDPL: ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు రూ.20 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం రూ.5 లక్షలతో అంగన్వాడీ భవనాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని,నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు.
వనపర్తి పట్టణ శివారులోని నరసింగాయపల్లి ఎంసీహెచ్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో వైద్య సేవలను పరిశీలించారు. అత్యవసర సమయంలో వినియోగించే వెంటిలేటర్ సదుపాయం పనిచేస్తుందో లేదో ఆరా తీశారు. చిన్నపిల్లలకు వెంటిలేటర్ సద్వినియోగం కల్పించాలని ఆదేశించారు.
VKB: దౌల్తాబాద్ మండలంలోని యాంకిలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ పెద్దలు వైభవంగా ప్రారంభించారు. సర్పంచ్ ఏ.మాణిక్యప్ప, రవీందర్ రెడ్డి, కోట్ల హన్మంతు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
MDK: పోలీస్ శాఖకు IOC ద్వారా రెండు పెట్రోల్ బంకులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ఇందులో భాగంగా ఆవుసులపల్లి వద్ద పెట్రోల్ బంకుకు ఎస్పీ గురువారం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే శంకరంపేట్ (ఆర్)లో ఒక బంకు నిర్మాణం కొసాగుతుందని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
KMR: పిట్లం మండలంలో అక్రమంగా మత్తు పదార్థాలు తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని బిచ్కుంద ఎక్సెజ్ సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. నమ్మదగిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం బోల్లక్పల్లి సమీపంలో టీవీఎస్ మోటర్పై మూడు క్యాన్ల అక్రమ కల్లును తరలిస్తున్న వాజిద్ నగర్కు చెందిన సుంకరి సాయిగౌడ్ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
NRPT: మక్తల్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలిగించే కట్టడాలు నిర్మించవద్దని వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రామ్ లీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం టాయిలెట్లు నిర్మించి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
NRPT: మక్తల్ మండలం మంథనోడ్ నుంచి పాతర్చెడ్కు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. వర్షాలప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారుతోందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులు ప్రజల సమస్యను దృష్టిలో ఉంచి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
NLG:చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డు కు చెందిన కాంగ్రెస్ నాయకులు మన్నెం సైదులు తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఐదేళ్ల వరకు వార్డులోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుకగా అందజేస్తామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. ఇవాళ జరిగిన ముప్పా ముత్తిరెడ్డి-మంజుల దంపతుల కుమార్తె అఖిల వివాహానికి హాజరై ఆయన ఈ కానుకను అందజేశారు.
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఛైర్మన్ తునం శ్రవణ్ కుమార్, వైస్ ఛైర్పర్సన్ సోమ రజిని రాజశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని అతి పురాతన ఆంజనేయస్వామి దేవాలయ కొండ నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణానికి మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎండోమెంట్ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేశారు. దేవాలయ గర్భగుడి గడప ముహూర్తం ఈ నెల 28న గ్రామ దాతల నిధులతో నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
JGL: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 2027 సంవత్సరంలో జూన్ 26-జూలై 7వరకు జరిగే పుష్కరాల దృష్ట్యా ఘాట్ నిర్మాణం, రోడ్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న గోదావరి పైప్ లైన్ పనులను మున్సిపల్ ఛైర్మన్ దావా స్వాతి-రమేష్ బాబు గురువారం పరిశీలించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సమస్య తలెత్తకుండా పైప్ లైన్ పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించారు.
PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ జరిగిన ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు/ ఉర్దూ/ హిందీ పరీక్షలో 98% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 4815 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 4731 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆమె వెల్లడించారు.
SRPT: తుంగతుర్తిలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉపేందర్, కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా కేదారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా సోమయ్య, సంజీవ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యవర్గం సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్నారు.