PDPL: పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇవాళ 103 కిలోల 45 సంవత్సరాల మహిళకు గర్భకోశానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ముత్తారం మండలానికి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
MDK: నర్సాపూర్ బీవీఆర్ఐటీలో “మెకానికల్ బాజా సే ఇండియా 2026” గురువారం రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మెదక్ జిల్లా పోలీసులు జెండా ఊపి ప్రారంభించారు. 10 తెలంగాణ జట్లు పాల్గొని సాంకేతిక నైపుణ్యాలు, వాహన రూపకల్పన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. కొత్త హోండా జిక్స్ 430 ఇంజిన్ పరిచయం జరిగింది.
MNCL: బీసీలపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు బీసీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. వెంటనే బీసీల రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
SRPT: జిల్లాలో అమలైన MGNREGA పనులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం VB-GRAMగా మారుస్తున్న నేపథ్యంలో Ministry of Rural Development (MORD) కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జిల్లాలో పర్యటిస్తున్నారు.
ADB: గురుకులాల్లో ఉచిత వసతితో నాణ్యమైన విద్య అందుతుందని ఐటీడీఏ PO యువరాజ్ మర్మట్ అన్నారు. గురువారం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, బోథ్ అడ్మిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. గిరిజన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. శివకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో క్రీడా మైదానంలా కనిపిస్తోంది. కొద్దిపాటి నీరు మాత్రమే మిగిలి ఉండగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. నీటిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులో పూడికను తొలగించి పునరుద్ధరించాలని పట్టణవాసులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.
JGL: జగిత్యాలలో ఈ నెల 28న ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. జిల్లాలోని 14 – 54 సంవత్సరాల వయస్సు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 -మధ్యాహ్నం 1:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
MDCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమ్నగర్ డివిజన్లోని అర్హులైన ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముస్లిం పెద్దలు చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
KMM: కారేపల్లిలో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై గోపి వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
MLG: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం గ్రామాల నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి సీతక్క హాజరై సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. సర్పంచులు నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు సంపాదించుకోవాలని సీతక్క సూచించారు.
WGL: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. రెండో రోజు పరీక్షలో జనరల్ మొత్తం 4821 విద్యార్థులకు గాను 4705 హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 744 విద్యార్థులకు గాను 713 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు.
వనపర్తి జిల్లాలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్ సీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క పేషెంట్కు దాదాపు రూ.7,000 టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .
NLG: కేరళలోని కుట్టిక్కానంలో జరిగిన జాతీయ సమగ్రత శిబిరం(NIC)లో NSS వాలంటీర్ కె.తరుణ్ ప్రతిభచాటారు. ఈ నెల 17 నుంచి 23 వరకు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెలంగాణ ప్రతినిధిగా తరుణ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
GDWL: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రారంభించింది. గద్వాల డిపోలో డీఎం సునీత, లాజిస్టిక్స్ ఏటీఎం బద్రి నారాయణ పోస్టర్లు విడుదల చేశారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (9154298609)ను సంప్రదించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
JN: రఘునాథపల్లి గ్రామంలో VOA భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.