SRPT: యాసంగి సీజన్కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శనివారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు.
మహబూబ్నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ.260 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది
నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయం పట్టికను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ బ్యాక్ లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు.
NZB: భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం బోధన్ డిపోలో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఎం విశ్వనాథ్ ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించి కార్గో సేవల ద్వారా నమోదు చేసుకుంటే నేరుగా భక్తుల ఇళ్లకు తలంబ్రాలు డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు.
KMR: భిక్కనూర్లోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. భువనేశ్వరీ సహిత స్వామి వారికి పుణ్యహవాచనం, అంకురార్పణం, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, విమాన రథోత్సవం, అవభృథ స్నానం నిర్వహించనున్నారు. అగ్నిగుండాలు, వీరభద్ర ప్రస్తావన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
MDK: B V Raju Institute of Technology, నర్సాపూర్లో “మెకానికల్ బాజా SAE ఇండియా 2026” మూడో రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయగా, 35 బగ్గీలు బ్రేక్ టెస్ట్ ఉత్తీర్ణులై ఫైనల్ ఎండ్యూరెన్స్కు అర్హత సాధించాయి. అనుభవాధారిత విద్యపై ప్యానల్ చర్చ జరిగింది. ఆదివారం నుంచి ఫైనల్ రేస్ జరగనుంది.
JN: జిల్లా కేంద్రానికి నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ను ఆయన ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు న్యాయ, మానసిక, వైద్య సహాయ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ రాయపల్లి సర్పంచ్ గాయత్రి మల్లేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ అవసరమని వివరించారు. అలాగే రాయపల్లి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని వారు కోరారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యూరియా విక్రయాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9, మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఆన్ లైన్లో బుకింగ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కొత్త విధానం రైతుల సౌకర్యం కోసమే అమలు చేస్తున్నారు.
HYD: GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సంటేజ్’ల దందాను ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
KMR: జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరిగి ‘ట్రిపుల్ సెంచరీ’ని దాటాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 పలుకుతుండగా, లైవ్ కోడి రూ.190గా ఉంది. పెరుగుతున్న ధరలతో చికెన్ ప్రియులు బెంబేలెత్తుతున్నారు.
BHNG: మోత్కూర్ ఆరో వార్డు ఆరెగూడెంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనసే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డులో దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించారు.
ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలనీ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
WGL: కొమ్మాలలో మార్చి 3 నుంచి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో బందోబస్తు, బారికేడ్ల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.