KNR: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్లో ఆదివారం 2కే రన్ నిర్వహించారు. కళాభారతి నుంచి డా. బీఆర్. అంబేద్కర్ స్టేడియం వరకు జరిగిన ఈ రన్లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ వడ్డెర బస్తీ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక కౌన్సిలర్ శ్రీరాములు అన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల ఛైర్మన్ రమాదేవి, అంగన్వాడి టీచర్ జయమ్మ ఆయనను సన్మానించారు.
NLG: మిట్ట వేసవిలో శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు తీసుకురావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చామల యాదగిరి రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన తనయుడు చామల వెంకటరమణ రెడ్డి సాగునీటి సరఫరాకు విశేష కృషి చేస్తున్నారని రైతులు కొనియాడారు. రబీ, ఖరీఫ్ పంటలకు నీరు అందేలా చొరవ చూపినందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
HNK: ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ పుట్టా రేణుక కుమారస్వామి అన్నారు. నారాయణగిరి గ్రామంలో రూ. 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఇవాళ సర్పంచ్ శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
జనగాం: మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఆమె అన్నారు.
NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్జీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు 5కే రన్ నిర్వహించారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని ఆమె సూచించారు.
MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఎస్సై తహసీద్దీన్ కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్టాండ్ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్కు తగలడంతో మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందారన్నారు.
WGL: ప్రజాపాలన – ప్రజా ప్రణాళికలో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో సోమవారం కాలువల శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగాపాణి పాల్గొని కాలువల శుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మున్సిపాలిటీ ముఖ్య లక్ష్యమని తెలిపారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండి ఇతర కానుకల పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని ఈవో తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
VKB: రోడ్డు పూర్తిగా గుంతలు పడి నిత్యం వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VKB నుంచి నాసన్పల్లి వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా గుంతలు పడి నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
NGKL: జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. అటు వాహనాల వేడి, ఇటు నెత్తిన మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
KNR: చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో సోమవారం పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామస్తులంతా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను చివరి వరకు కొనుగోలు చేసి ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కంపేట్ అధికారులను ఎమ్మెల్యే కోరారు.
HYD: ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు ICMR నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా 45 ఏళ్లలోపు ప్రతి ఏడుగురిలో ఒకరికి స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్, జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణాలుగా HYD తార్నాక ICMR అధికారులు తెలిపారు.
RR: గచ్చిబౌలిలో జరిగిన “కమ్మ ఐకాన్ లెజెండరీ అవార్డ్స్ – 2026” వేడుకలో ప్రముఖ సామాజిక కార్యకర్త, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారాన్ని అందుకున్నారు. సమాజ సాధికారత, విద్య, వైద్యం, పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.