MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 453, ద్వితీయ సంవత్సరంలో 211 మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.
MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి.అస్మా రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో విజేతగా నిలిచారు. అస్మా రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో మూడో స్థానంలో సాధించారు. దీంతో నిర్వాహకులు ఆమెకు ట్రోఫీతో పాటు రూ.5000 నగదు బహుమతిని అందజేశారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.
SDPT: అక్కన్నపేట(M) మల్లంపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే తలుపులు, కిటికీలు ఊడిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MNCL :కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన టకిరే నాగేశ్ (23) సోమవారం పంటలకు వాడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తెతో పాటు 3నెలల శిశువు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో నాగేశ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
NRML: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని మొత్తం 381 అంగన్వాడీ కేంద్రాలకు మీటర్లు అవసరమవగా, ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు నేటి ప్రకటనలో తెలిపారు.
HYD: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచులకు సరికొత్త కానుకగా గ్రామీణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాలలో కలిపి మొత్తం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో వార్డుల వారిగా అభివృద్ధి చేపడుతానని వెల్లడించారు.
SRCL: మంత్రి పొన్నం ప్రభాకర్ను సిరిసిల్ల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రిని కలిసిన వారిలో ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివాస్, వెంగళ లీల, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,545 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 22,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18,300 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
NLG: సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ రకాల ఆటలలో దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వివిధ ఆటలలో విజయాన్ని సాధించారు. అనంతరం తదుపరి ఆటలకు ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, జూనియర్ యోగ, యోగ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు.
NRML: భైంసా పట్టణంలో 141 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాల లాభాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారిపై సోమారం శివారులో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఉన్న ఈ గుంత వాహనం సమీపానికి వెళ్లే వరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతను పూడ్చాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత మండల వనరుల కేంద్రాల్లో (MRC) దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
BDK: అశ్వారావుపేట ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సంగీత రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థినులకు పార్లమెంటరీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్పీకర్గా తాజాని, ప్రధానిగా ఎం.డి. ఆయేషా నిమ్రా పాత్రలను సమర్థంగా పోషిస్తూ సభా నిర్వహణను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.
HYD: బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
BHNG: జిల్లాలో మహిళా సంఘాల కోసం ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న సంఘాల కోసం ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నిధులు కేటాయించింది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 186 భవనాలకు అనుమతులు లభించాయి. 200 గజాల స్థలంలో నిర్మించే ఈ భవనాలు పూర్తయితే మహిళలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది.