TPT: హైదరాబాద్కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్కు శుక్రవారం రూ.1 కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.
GNTR: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మార్చి 1న అమరావతి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, అనంతరం శంకుస్థాపన వేదికలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
NDL: పల్నాడు జిల్లా పోతవరం సమీపంలో ఆటో ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఆ రూట్లో ప్రయాణిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘటనను గమనించి ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చెప్పడంతో స్థానికులు ఆయన చర్యలను అభినందించారు.
KRNL: అవుకు మండల పరిధిలోని రాయలసీమ రైస్ మిల్ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. మెట్టుపల్లి రోడ్ నుంచి అవుకు బస్టాండ్ వైపు వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ బైక్లో మంటలు చెలరేగాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే దిగిపోయి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పగా, వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న నార్పల మండలంలోని గూగూడులో వెలసిన కుళ్లాయిస్వామి, అంజనేయస్వామి ఆలయాలను మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో శోభ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయాలను మూసివేయనున్నారు. ఆలయ శుద్ది అనంతరం 4న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
KDP: YVUలో AP స్కిల్ డెవలప్మెంట్,YVU ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించి, విద్యార్థులు ప్రారంభ వేతనం కంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నిరంతర అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మేళాకు 332 మంది హాజరుకాగా, హెటెరో ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి కంపెనీలు 57 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి.
ELR: ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
VSP: విశాఖ నగర ప్రజలు తాగునీటిని వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. నగరంలోని 98 వార్డులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని, కలుషిత నీరు ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కాలువల గుండా వెళ్లే 448 పైపులైన్ల మార్పు పనులు రూ. 4 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు.
AKP: మండల కేంద్రమైన మునగపాకలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విశ్రాంత ఎస్పీ స్వర్గీయ పెంటకోట సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ మహిళ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
AKP: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడితే జీవితం అంధకారం అవుతుందన్నారు.
AP: తిరుమలలో ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం జరగనుంది. రూ.5,500 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలపనుంది. 90 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. శ్రీవారి ముడుపు పత్రం పథకంపై బోర్డు మాట్లాడనుంది.
JGL: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో ఇంటి పన్ను వసూళ్లలో 100 శాతం లక్ష్యాన్ని సాధించిన వార్డు ఆఫీసర్ కోడం రాజును మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అభినందించారు. పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లు జరిపి మున్సిపాలిటీకి ఆదర్శంగా నిలిచినందుకు రాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఆర్ఎ భాస్కర్, పాల్గొన్నారు.
RR: మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని గచ్చిబౌలి ఏఈ భాస్కర్ తెలిపారు. నానక్ రాంగూడ, అలేఖ్య హోమ్స్, విజయకృష్ణ బిల్డింగ్, డోమినోస్ ఏరియా, గోల్ఫ్ వ్యూ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
BHPL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరణ తప్పనిసరిగా పెట్టుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. గణపురం పోలీస్ స్టేషన్లో చక్రవర్తి హాస్పిటల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో MLA హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SP పాల్గొన్నారు.
TG: కళ్లెదురుగా కనిపించే సూర్యభగవానుణ్ణి ప్రత్యక్షనారాయణుడంటూ ఆరాధిస్తాం. ఆయన తూర్పున ఉదయిస్తాడు కనుక పూజామందిరంలో తూర్పు ముఖంగా కూర్చుని పూజించటం శ్రేష్ఠమని పౌరాణిక గ్రంథాలు సూచిస్తున్నాయి. దేవుడి పటాలు, విగ్రహాలు ఏ ముఖంగా ఉన్నా.. పూజ చేసే వ్యక్తి మాత్రం తూర్పు ముఖంగా కూర్చోవాలి. అలా అవకాశం లేదనుకుంటే.. ఇతర దిక్కులు ఫరవాలేదు కానీ దక్షిణ ముఖంగా మాత్రం పూజించకూడదు.