HNK: పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDOగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈవో పదోన్నతి పొందారు. ఈ మేరకు నేడు ఆయనను కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ ఉన్నారు.
BDK: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
TG: నాగర్కర్నూల్లో మాజీమంత్రి KTR పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇది మాటలకందని మహా విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదని.. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని సూచించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి యన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద రూ.50 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని ఆలయ ఈవో విజయ రాజు బుధవారం మీడియాకు తెలిపారు. మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి, గ్రామస్తులతో కలిసి నూతన డ్రైనేజీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు.
ASR: అరకులోయ మండలం పరిధిలో ఇన్వెస్టు బ్రిర్జి పౌండేషన్ ద్వారా నిపుణులైన వైద్యుల చేత బుధవారం బస్కి గ్రామ పంచాయతీలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో కంటి పరీక్ష, దంత పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు కళ్ళద్దాలు, ఉచితంగా అందజేశారు. ఈ మేరకు పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ NSR ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
CTR: పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామ సమీపంలో అల్లనేరేడు తోటలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 1,50,000 డ్రిప్ పైపులు, కేబుల్స్ కాలిపోయి నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.
T20 WC చరిత్రలో ఆసియా జట్లు లేకుండా ఇప్పటివరకు సెమీఫైనల్స్ జరగలేదు. దాదాపు ప్రతి ఎడిషన్లోనూ రెండు ఆసియా జట్లు సెమీస్కు (2016, 2021ల్లో ఒక్కో జట్టు మాత్రమే) చేరుకున్నాయి. అయితే, ఈసారి సెమీస్ చేరుకోవడానికి భారత్, పాక్, శ్రీలంక తడబడుతున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం SA, WI, NZలతో ఆసియా జట్లకు భారీ పోటీ నెలకొంది.
NLR: మహిళలు పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013 మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం నెల్లూరు తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 మంది పైన మహిళా ఉద్యోగులు పని చేస్తున్న చోట ఐ.సి.సి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
VZM: ఈనెల 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చీపురుపల్లి మండలం రావివలస వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రానున్వారు. ఈ నేపథ్యంలో బుధవారం సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పరిశీలించి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక నిర్మాణం, పార్కింగ్ స్థలాలు, తాగునీరు తదితర ఏర్పాట్లను సమీక్షించారు.
KRNL: జనసేన కార్యకర్తలను సాధకులుగా పిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు బుధవారం ఆదోని నియోజకవర్గం ఇంఛార్జ్ మల్లప్ప తెలిపారు. ఇప్పటికే 75 మంది సాధకులను నియమించామని, సభ్యత్వం తీసుకున్న వారందరికీ భీమా రక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. మార్పు కోసం యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
AP: శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మహిళలకు రూ.1500 ఇచ్చే స్త్రీ నిధి పథకం ఏమైందని వైసీపీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా MLC వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఒక్కొక్కటిగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.
HYD: నగరంలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం భానుడు ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉష్ణోగ్రత 29°Cగా నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ కోరారు. గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన బోగ్ బండార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
TPT: నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న తిరుచ్చి టికెట్ ఆధారంగా ఆమెది తమిళనాడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.