TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చింది. ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు రానున్నారు.
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.
GNTR: గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,
కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
KRNL: ఆలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఇవాళ డిమాండ్ చేశారు. నిందిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
NLG: నార్కట్పల్లి శివారులోని కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, TG07T4554, TS07UH4554 నంబర్లు గల లారీల్లో హైదరాబాద్కు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. లారీలను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
జగిత్యాల జిల్లా నెట్బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.
SKLM: జిల్లా కేంద్రంలో అతిసార వ్యాధి కేసులు నమోదు కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వ్యాధి ప్రభావంపై సమీక్షించిన అనంతరం బాధితులకు తక్షణమే మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రకాశం: ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా గిద్దలూరు లోని ఏటీఎం కేంద్రాల్లో సీఐ సురేష్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల్లో లైటింగ్ , సెక్యూరిటీ గార్డుల లభ్యతను తనిఖీ చేశారు. ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చడం వంటి మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.
BDK: బూర్గంపాడు(మం) సారపాక గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పదేళ్లుగా అసంపూర్తిగా ఉండగా, దీనిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
GDWL: పోలీస్ స్టేషన్కు వచ్చేది కేవలం న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చట్టప్రకారం అండగా నిలబడండి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన నేరుగా 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూవివాదాలు, మోసాల వల్ల ఆవేదనతో వచ్చిన బాధితుల ముందే సంబంధిత అధికారులకు అప్పచెప్పారు.
BHNG: బీజేపీ రాష్ట్ర నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకోరి అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్లో సాయి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయి తన పైన చేతబడి చేశాడని నిందితుడు బాలు హత్య చేసినట్లు సమాచారం. అతణ్ని హత్య చేసిన తర్వాత నిందితుడు రోడ్డుపైనే నిల్చున్నాడు.
KNR: శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ముదిగంటి విజయలక్ష్మి అకౌంట్లో, అదే గ్రామానికి చెందిన సీఏ కొత్త లక్ష్మి అక్రమంగా సీఎంఆర్ రిలీఫ్ చెక్కు ద్వారా డబ్బులు వేయించిందని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన అధికారిపై, నిధుల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
AP: రాజమండ్రి జిల్లా చౌడేశ్వరినగర్కు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ చేరుకుని మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 126 కుటుంబాలకు వ్యాపారి పాలు పోశాడు. ఇప్పటికే పాలు, పెరుగు, రక్త నమూనాలు సేకరించాము. ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్ష జరిపారు’ అని తెలిపారు.