TG: HYDలో హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి.. నీళ్లు కలుషితమవుతున్నాయంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జలమండలిని కోర్టు ప్రశ్నించింది. జంట జలాశయాల నిర్వహణపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
JGL: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల్, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. భోగ శ్రావణి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
SRPT: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు హుజూర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రామస్వామిగుట్ట హౌసింగ్ కాలనీని పరిశీలించి, దొండపాడు రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకం, జానపహాడ్ లిఫ్ట్ పథకాల పనులను సమీక్షిస్తారు. అనంతరం నేరేడుచర్ల మండలంలో పలు బీటీ రహదారులను ప్రారంభించనున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
W.G: ఈ ఏడాది మార్చి 14న నిర్వహించనున్న తొలి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు న్యాయవాదులు విశేష కృషి చేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. సోమవారం నరసాపురం బార్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సివిల్ తగాదాల్లో రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు.
TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం నిర్వహించారు. గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్పల్లి బాలాజీ నగర్లో చదరపు గజం రూ. 1.64 లక్షలు పలికింది.
PLD: పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 151 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు
VSP: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాల్తేర్ డివిజన్కు చెందిన ఆరుగురు కేడెట్లు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఇద్దరు రోవర్స్, ఇద్దరు గైడ్స్, ఇద్దరు రేంజర్స్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. విశాఖలోని ‘అరణ్య’ క్యాంపింగ్ సెంటర్లో ప్రపంచ థింకింగ్ డే సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ పురస్కారాలు ప్రదానం చేశారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న ‘రూబారూ’ అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్న జింబాబ్వే, ఇప్పుడు పటిష్టమైన వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో రెండు జట్లు కూడా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. దీంతో, ఈ ‘అజేయ’ జట్ల మధ్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
MDK: బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్హెచ్ఓ లకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పైరవులకు తావు లేకుండా సంప్రదించాలని సూచించారు.
NRML: రానున్న గోదావరి పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారంనిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివి.నాయుడు ప్రజల వద్ద నుండి 48 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో తమ సమస్యను తెలియజేయవచ్చని సూచించారు.
ప్రకాశం: మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.57,490 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
అన్నమయ్య: అర్హులైన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ నాయకురాడు ముక్కా వరలక్ష్మి అన్నారు. సోమవారం పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన సోమేశుల ప్రవీణ్ మరణం అనంతరం ఆయన కుటుంబ సభ్యురాలు కీర్తికి రూ.1,90,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు.