కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఈనెల 23వ తేదీన సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
NRML: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ‘అరైవ్ అలైవ్’ రెండో దశ కార్య క్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు.
SRD: మునిపల్లి మండలం కంకోల్, ముగ్ధంపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం ప్రతిష్టాత్మక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అందోల్ మాజీ MLA చంటి క్రాంతి కిరణ్, BRS రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్, మాజీ ZPTCపైతర మీనాక్షి, మాజీ MPP శైలజ శివశంకర్ తదితరులు సందర్శించి స్వామివారికి పూజలు చేసి దర్శించుకున్నారు.
WGL: కుమ్మెర జాతరలో కులం పేరుతో ఆరు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని హత్య చేసిన అగ్రకుల పెత్తందార్ల పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని SFI HNK జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద SFI నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొవ్వొత్తులతో మౌనం పాటించి, దోషులను అరెస్ట్ చేయాలని కోరారు.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ లో గెలుపొందిన కౌన్సిలర్ల కు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని నూతన కౌన్సిలర్ల కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
AP: పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత వైసీపీదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో నిందితుడితో జగన్ రాజీపడ్డారని తెలిపారు. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. శ్రీవారి తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన ఘనత కూడా వైసీపీ నేతలదేనని మండిపడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రియులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. WGL జిల్లాలో వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భద్రకాళి దేవాలయం; MLG జిల్లాలో రామప్ప దేవాలయం, లక్నవరం, బోగోత జలపాతం; BHPL జిల్లాలో కోటగుళ్ళు, పాండవుల గుట్ట, కాలేశ్వరం ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పర్యాటకులు తరలివస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్లారా?. కామెంట్ చేయండి.
BDK: అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల కార్యకలాపాల కోసం రూ. 50 లక్షలతో నూతనంగా కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మిస్తామని కార్పొరేటర్ హరిహరన్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 55వ డివిజన్ కార్పొరేటర్ హరిహరన్ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి, శక్తి టీం నోడల్ అధికారి ఏఎస్పీ మనీషా రెడ్డి ఆదేశాల ప్రకారం పాలకొండ సచివాలయం మహిళ పోలీసు, బాల్య వివాహం నిరోధంపై మైనర్ బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టప్రకారం నిర్వహించాలని సూచించారు. చిన్న వయస్సులో వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. అలాగే చదువుపై దృష్టి సారించాలన్నారు.
SKLM: నరసన్నపేట చిక్కాలవలసకి చెందిన ఆర్మీ జవాన్ అమృత్ కుమార్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదివారం జవాన్ పార్థివదేహానికి ఎమ్మెల్యే రమణమూర్తి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దేశానికి సేవ చేసిన ఈ వీరజవాన్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేము అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లి కట్నకానుకను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ. 26,551 నగదు పొదుపు చేసి అందజేయడంతో వారు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు ఉన్నారు.
VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం సాయంత్రం గవర్నర్తో మంత్రి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.
GDWL: పురపాలక ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 22 నుంచి ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపిన కార్యక్రమం పునఃప్రారంభమవడంతో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. అధికారులు ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
WGL: వరంగల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు EV శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల పూర్వ విద్యార్థులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె పెద్దనాన్న ఆంజనేయులు వద్ద నివసిస్తోంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు SI నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.