MBNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3వ విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజానర్సింహా అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు పంతం చక్రపాణి, పంతం రవి కుటుంబ సభ్యులు రూ.1,05,000 ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం 21 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. మార్కండేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టకు రూ.51,000 విరాళం ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చక్రపాణి అన్నారు. అనంతరం వారిని ఆ సంఘం సభ్యలు సన్మానించారు.
KMM: నేలకొండపల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్లపై ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలోనే జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసులు సూచించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడు తూఅగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 101, 102 నంబర్లను సంప్రదించాలన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
AP: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్ రోడ్డు విషయం కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఆపేసిన పనులు తిరిగి ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి రేకులపల్లి వెళ్లే రోడ్డు డైవర్షన్ రోడ్డు కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం డైవర్షన్ రోడ్డును ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సర్పంచ్ సరోజినీ దేవి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొదటి రోజు చిట్యాల పురపాలికలోని 12వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కమిషనర్ దండు శ్రీను ప్రతిజ్ఞ చేశారు. వీరందరూ స్వయంగా చీపుర్లు పట్టి వార్డులో చెత్తాచెదారాన్ని క్లీన్ చేశారు.
NDL: బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలో గొర్రెలు తొక్కిసలాట జరగడంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు నీటి గుంతలోకి నీరు త్రాగడానికి వెళ్లడంతో ఒకదానికి ఒకటి తొక్కిసలాట జరగడంతో.. 80 గొర్రెలు అక్కడే మృత్యువాత పడటంతో బాధితులు నగేష్, ఆంజనేయులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పొంగులేటి తెలిపారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి మరియు ఏపీఎంఎస్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశమని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు.
BDK: ఆళ్లపల్లి రైతు వేదిక ప్రాంగణంలో మార్చి 8న(ఆదివారం) ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పీహెచ్సీ వైద్యులు అర్వపల్లి రేవంత్ తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఎముక, దంత తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
T20 WC ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీలుగా ICC 8 మంది పేర్లను ప్రకటించింది. ఈ రేసులో సంజూ శాంసన్తో పాటు విల్ జాక్స్(ENG), షాహిబ్దాదా ఫర్హాన్(PAK), లుంగి ఎంగిడి(SA), మార్క్రమ్(SA), రచిన్ రవీంద్ర(NZ), వాన్ స్కాల్క్విక్(USA), టిమ్ సీఫర్ట్(NZ) ఉన్నారు. అసోసియేట్ జట్ల నుంచి ఎంపికైన స్కాల్క్విక్ ఈ టోర్నీలో ఇప్పటికీ టాప్ వికెట్ టేకర్(13)గా ఉన్నాడు.
AP: అచ్యుతాపురం సెజ్కు 5 వేల ఎకరాలు సేకరించారని మంత్రి భరత్ వెల్లడించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ప్రకారం పరిహారం అడుగుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయంలో సంప్రదింపులు చేయాలని కోరారు. కాకినాడ సెజ్ కోసం 4 వేల ఎకరాలు తీసుకున్నారని.. అక్కడ కూడా కొందరు రైతులకు పరిహారం అందలేదన్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను MEO నగరం మల్లేశం శుక్రవారం సందర్శించి తనిఖీ చేశారు. స్థానిక వసతులు సౌకర్యాలను పరిశీలించారు. పిల్లల నమోదు, ఉపాధ్యాయుల వివరాలు, మెనూ ప్రకారం భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు తదితర రికార్డులను ఆయన పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఇందులో ప్రిన్సిపాల్ తిరుపతయ్య, VP ఫణిందర్, విట్టల్ ఉన్నారు.