రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్తో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త పంపిణీ బాధ్యతలను హాలీవుడ్ దిగ్గజ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ చేపట్టబోతున్నట్లు సమాచారం.
‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కామాక్షి భాస్కర్ల. తాజాగా ఆమె ‘అగాధ’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇందులో ఆమె ‘మహాదేవి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
నటి పూనమ్ కౌర్ ఇవాళ వేములవాడలోని భీమేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకుంది. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాజన్న ఆలయ నిర్మాణ పనులు పూర్తైన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటానని ఆమె తెలిపింది.
హీరోయిన్ దీపికా పదుకొనె రెండోసారి తల్లి కాబోతున్న తరుణంలో పిల్లల గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే, ముగ్గురు పిల్లలతో సమయం గడిపేదాన్ని అని ఆమె తెలిపింది. ఇప్పుడు కూడా తన వృత్తిని కొనసాగిస్తూనే పిల్లలను షూటింగ్ సెట్స్కు తీసుకెళ్లాలని ఉందని, కుటుంబంతో గడపడం తనకు ఇష్టమని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఒకే వారంలో సుమారు రూ.20L ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్కు రూ.10.5L, మాజీ మేనేజర్ కుటుంబానికి రూ.9.5L అందజేశారు. అలాగే.. ఇటీవల వివిధ సేవా సంస్థలకు రూ.10L, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్కు రూ.5L విరాళంగా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకుని అండగా నిలిచారు.
కాంతార స్టార్ రిషబ్ శెట్టి ‘యూత్’ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని, ఇది తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమతి అని కొనియాడాడు. నటీనటులు సహజంగా నటించారని, దర్శకుడు కెన్ కరుణాస్ పరిశ్రమకు దొరికిన ఆస్తి అని పేర్కొన్నాడు. టీనేజ్ ప్రేమ, బ్రేకప్, జీవిత పాఠాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది.
హీరో ప్రదీప్ రంగనాథన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి, ఆ సమయంలోనే స్క్రిప్టులు రాసి షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ‘కోమాలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి స్టార్డమ్ దక్కించుకున్నాడు. నాడు కుటుంబాన్ని నమ్మించి కష్టపడిన ప్రదీప్, నేడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్ర పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు విజయ్ సేతుపతి ఆయనపై ప్రశంసలు కురిపించాడు. పూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్’ చిత్రం కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన విలక్షణమైన శైలితో పూరి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకున్నాడు.
స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియా మోహన్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ ప్రియ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నాకు చెల్లి వచ్చేసింది – మీర్’ అంటూ తన కుమారుడి తరఫున ఒక క్యూట్ పోస్టర్ను షేర్ చేశాడు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించగా, ఇప్పుడు ఆడబిడ్డ రావడంతో అట్లీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
దర్శకుడు హను రాఘవపూడి NTRను ‘సునామీ’ వంటి నటుడని కొనియాడాడు. ఆయనలో Sr. NTR గారి అన్ని లక్షణాలు ఉన్నాయని, పౌరాణికం నుంచి కామెడీ వరకు ఏ పాత్రనైనా చేయగలరని ప్రశంసించాడు. ఇప్పటివరకు సరైన కథ కుదరకపోవడం వల్లే తారక్తో సినిమా చేయలేకపోయానని, ఆయన స్థాయికి తగ్గ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందన్నాడు. వేటూరి కూడా తారక్ స్పష్టమైన ఉచ్చారణను మెచ్చుకునేవారని హను గుర్తుచేశాడు.
దిగ్గజ దర్శకుడు భారతీరాజాను నటి రాధిక పరామర్శించిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన్ను కలిసిన వీడియోను ఆమె పంచుకున్నారు. రాధిక నటించిన ‘తాయ్ కిళవి’ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని భారతీరాజా ప్రశంసించారు. తన గురువు ఆశీర్వాదం అన్ని అవార్డుల కన్నా గొప్పదని రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాపై ఉన్న ప్రేమే ఆయన్ను ముందుకు నడిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఏకంగా 10కి పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నిలవడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం వచ్చినా, డిజిటల్ వేదికపై మాత్రం పవర్ స్టార్ మేనియా కొనసాగుతోంది.
ధనుష్ హీరోగా నటించిన ‘కర’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ ఇందులో బ్యాంక్ దొంగగా సరికొత్తగా కనిపిస్తున్నారు. వరుస దోపిడీలు చేసే దొంగకు కచ్చితంగా ఏదో అవసరం ఉందనే కోణంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో మమితా బైజు హీరోయిన్. ఈశారీ కె.గణేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ మార్క్ నటన సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
దక్షిణాది సినీ పరిశ్రమలో పెను మార్పు చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ అనే తేడా లేకుండా.. దక్షిణాదిలోని 4 సినీ పరిశ్రమలకు చెందిన అగ్ర నిర్మాతలందరూ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చారు. సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్'(SIFPA) ఆవిర్భవించింది.
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు సంబంధించిన OTT డీల్ ఈ వారంలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన వెంటనే, చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.