సినిమా రంగానికి సంబంధించి ప్రపంచంలో ఎవరికైనా వీరాభిమానులున్నారంటే అది మెగా ఫ్యామిలీకేనని ఎన్నాళ్ళగానో ప్రూ అవుతూనే ఉంది. మెగాప్యామిలీతో సినిమాలు తీసే దర్శకనిర్మాతలని వాళ్ళు కుటుంబ సభ్యులకన్నా మిన్నగా ప్రేమిస్తారు. వాళ్ళకి గుండెల్లో గుడి కట్టేస్తారు. అలాగే వాళ్ళకి ఏదైనా లోటు జరుగుతుంటే కూడా అంతే మండిపోతుంది వాళ్ళకి. అదే మెగా ఫాన్స్ అంటే. పైగా పవన్ కళ్యాణ్ అంటే మరీను. ఆయన అభిమానుల వీరావేశం అలా ఇలా ఉండదు. ఆకాశమే హద్దుగా పవన్ పేరు చెబితే చాలు ఊగిఊగా రేగిపోతారు.
గతంలో తమ హీరోకి ఖుషీ లాంటి మాస్ సెన్సేషనల్ హిట్ ఇచ్చిన నిర్మాత ఎఎం రత్నం మళ్ళీ పవన్తో సినిమా నిర్మించబోతున్నారంటే వాల్ళ ఆనందానికి, గర్వానికి అంతూపొంతూ లేకుండా పోయింది. పైగా అది పీరియడ్ డ్రామా అనేసరికి మరింత వెర్రెక్కిపోయారు. భారీ ఎత్తు సెట్లు, దేశంలో అనేక చారిత్రక ప్రదేశాలలో షూటింగ్, పవన్ కళ్యాన్ చిత్రాలలోనే అత్యధిక బడ్జెట్….ఈ అంశాలన్నీ మెగా అభిమానులకి పెద్ద పండగలా అనిపించాయి.
ఈ సినిమాకి హరిహరవీరమల్లు అని నిర్ణయించి ప్రకటించిన తర్వాత మామ్మూలు సంచలనం రేగలేదు. ఊరూరా, వాడవాడలా సంబరాలే సంబరాలు. కానీ షూటింగ్ ఆగిఆగి జరుగుతూ ముందుకెళ్ళింది. పవన్ అభిమానులు కూడా ఆలిస్యమవుతున్నా తమాయించుకుని తగ్గుతూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ హీరో ఎన్నికల సంకుల సమరంలో జనసేన ప్రధాన సైనికుడై కత్తులు దూస్తుంటే ఈ యుద్ధంలో వాళ్ళు కూడా సైనికులుగా భుజం కలిపారు కాబట్టి వీరమల్లు జాప్యాన్ని ఆర్ధం చేసుకుని, ఓర్చుకున్నారు.
ఎన్నికలైపోయాయి. పవన్ జనసేన అధ్యక్షుడిగా సాధించిన ఘనవిజయం ప్రపంచప్రఖ్యాతమై సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆ సంబరాలూ కొన్నాళ్ళు గడిచాయి. వీరమల్లు పక్కన అలా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తిస్తూ, కొన్నాళ్ళకి మిగిలిన షూటింగ్ కార్యక్రమాలకి డేట్స్ ఎలాట్ చేశారు. షూటింగ్ పూర్తియిపోయింది. ఒరిజినల్ డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నా, కొత్త దర్శకుడు పూనుకున్నా అన్నిటినీ ఫేన్స్ ఓపిగ్గా, అంతా మంచి జరుగుతుందిలే అనే ఆశాభావంతోనే ఎదురుచూపులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చారు.
ఇంక అక్కడ మొదలైంది. డేట్స్ మీద డేట్స్ మారుతూ వచ్చాయి. రిలీజ్ అయిపోతుందిలే అనుకునే లోపు వాయిదా పడిందని తెలియగానే గుండెలు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. తర్వాత మళ్ళీ మరో డేట్….మరో డేట్…ఇలా ధారావాహిక కార్యక్రమంలా సాగుతూ రావడం, ఏ అపడేట్ రాకపోవడంతో ఇంక సహనం చచ్చిపోయింది పవన్ అభిమానసేనకి.
ఎక్స్ హేండిల్తో విరుచుకుపడిపోయారు. కనీసం ఆప్డేట్స్ ఇచ్చి ఛావండి అని తీవ్రస్వరంతో విరుచుకుపడ్డం మొదలెట్టారు. దశాబ్దాలుగా పవన్ అభిమానులుగా కొనసాగుతూ, పవన్ విజయమే తమ విజయంగా భావించి, ఇన్నాళ్ళు ఇన్నేళ్లు ప్రేమను పంచిన వారికి ఈ జాప్యం, గోప్యం భరించలేని ఆసహనానికి గురి చేశాయి.
ఇతర హీరోల అభిమానుల ముందర తలెత్తుకోలేని పరిస్థితి దాపురిస్తుంటే తట్టుకోలేక ఎక్స్ ఫైట్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఇతర హీరోల అభిమానులే కాదు కదా. ఇప్పుడు పవన్ రాజకీయ ప్రత్యర్ధి వైయస్సార్ పార్టీకి. వాళ్ళు అప్పుడే నిప్పు పెట్టడం మొదలుపెట్టారు. ఆ వేడి మాత్రమే పవన్ అభిమానులలో కాక పుట్టించి, కేకలు పెట్టిస్తోంది.
కానీ, వీరమల్లు చిత్రనిర్మాత రత్నం ఏం మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి. ఓటిటి కబందహస్తాలలో సినిమాల రిలీజులు చిక్కుకున్నాయి. పూర్వంలా నిర్మాతలు స్వతంత్రులు కారు. వాళ్ళెలా చెబితే అలా వినాలి. యూనిట్ సకాలంలో వర్క్ పూర్తి చేసుకోలేకపోయారు. ఓటిటి ఫిక్స్ చేసిన స్లాట్ డేట్లో రిలీజుకి సిద్ధం కాలేకపోయారు. వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్టుగా అయిపోయింది వీరుమల్లు విడుదల వ్యవహారం. ఇప్పుడేమో ఏ డేట్ ఫిక్స్ చేయాలో తెలియక తికమకలో పడిపోయారు. అది చూసి పవన్ ఫేన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అదీ సంగతి.