దేశవ్యాప్తంగా హైకోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మైసూరుకు చెందిన శ్రీనివాస్ లూయిస్గా గుర్తించారు. తన భార్యతో ఉన్న గొడవల కారణంగా ఆమెను ఇరికించాలనే ఉద్దేశంతో.. ఆమె పేరు మీద ఉన్న ఇమెయిల్ ఐడిని ఉపయోగించి శ్రీనివాస్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.
NLR: చిట్వేలి – రాపూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. చిట్వేలి ఏఎస్ఐ వెంగయ్య తెలిపిన వివరాల మేరకు గూడూరు నుంచి వేంపల్లికి నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డులోని కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. నిమ్మకాయల యజమాని లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
WNP: రాయిగడ్డకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి రాగివేణు సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్కు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వేణు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణంతో పార్టీకి తీరని లోటని దేవన్న సంతాపం తెలిపారు.
AP: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏసీ పేలిపోయి రేబాక రామారావు అనే విశ్రాంతి ఉద్యోగి మృతిచెందాడు. ఏసీ పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు మంచానికి ఉన్న దుస్తులకు అంటుకోవడంతో రామారావు మృతిచెందినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: వనపర్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత రాగి వేణు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం రాగి వేణు కుమారుడు చంద్రశేఖర్కు ఫోన్ లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని అన్నారు. రాగి వేణు తనకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు అని, మృతి చెందడం కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం రాత్రి బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళా ప్రయాణికురాలి మూడు తులాల బంగారు గొలుసు మాయమైంది. గౌతమి గుత్తి నుండి గుంతకల్కు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
AP: విశాఖ గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు బయటపెట్టాడు. మౌనిక డేటింగ్ యాప్లో పరిచయమైందని, రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. జాబ్ ఐడీ కార్డు తీసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి తన భార్య వెళ్లడంతో మౌనికను ఇంటికి పిలిచినట్లు తెలిపాడు. రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు.
ప్రకాశం: మార్కాపురం మండలంలోని గొట్టిపడియలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో శ్రీరామ నవమి పండుగ వేడుకలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
WNP: యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసలవకుండా జాగ్రత్త పడాలని చిన్నంబావి ఎస్సై రామన్ గౌడ్ హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. బెట్టింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
AP: నెల్లూరు జిల్లాలో జంట హత్యల కలకలం చోటుచేసుకుంది. కొడవలూరు మండలం గండవరం పొలాల్లో దుండగులు ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కావలి రూరల్ వెంకయ్య గారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. లారీ పూర్తిగా ద్వంసం అయ్యింది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు.
TG: హైదరాబాద్ నగర శివారులోని అత్తాపూర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హాసన్నగర్లో మతిస్థిమితం లేని యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
PLD: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నబిడ్డ అని కూడా చూడకుండా కత్తెరతో దాడికి తెగబడ్డాడు. మాచర్ల రోప్వే కాలనీకి చెందిన గణేశ్ నిత్యం మద్యం తాగి గొడవపడేవాడు. ఆదివారం భార్యతో వాగ్వాదానికి దిగి, అడ్డువచ్చిన కుమారుడు అభిషేక్పై కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలుడి వీపు, చేతిపై తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.
TG: HYDలోని బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్లో 16 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఘటనలో నాలుగు బైక్లు పూర్తిగా దగ్ధం కాగా.. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.