WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు TPCC చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు సంబంధిత జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
NLG: తెలుగు భాషా బోధనతోనే విద్యార్థులు సమున్నతంగా ఎదుగుతారని చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన టీచర్, డాక్టరేట్ గ్రహీత సాగర్ల సత్తయ్య పేర్కొన్నారు. ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాష కనుమరుగవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ఉనికిని కాపాడుకునేందుకు ప్రాథమిక విద్యతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు కూడా తెలుగులోనే బోధించాలని సూచించారు.
VKB: ఆలంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిరెడ్డిపల్లి, సంబంధిత తండాలకు వెళ్లే ఈ మార్గంలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. వర్షం లేకపోయినా నీరు నిలవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
VKB: మర్పల్లి మండలంలోని చెరువులు పూడిక నిండి మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో చెరువులు నిండి ఆయకట్టు రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖల్కోడ, ఘనపూర్, రావులపల్లి గ్రామాల్లోని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.
KMM: కారేపల్లి బోటితండా పంచాయతీ ఇంఛార్జ్ సర్పంచ్గా ఉప సర్పంచ్ బాదావత్ మంగీలాల్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సర్పంచ్ భూక్యా తులిశ్యా మృతి చెందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. శుక్రవారం ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మంగీలాల్ను కలిసి ఇంఛార్జ్ సర్పంచ్ నియామక ఉత్తర్వులను అందజేశారు. జాయింట్ సిగ్నేచర్ అధికారాన్ని వార్డ్ మెంబర్ మంగికి కల్పించారు.
ADB: ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు సోమశేఖర్, మహేష్ శనివారం తెలియజేశారు. 7రోజులపాటు కొనసాగుతున్న జాతరకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకుంటారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ASF: తిర్యాణి ఆసుపత్రిలో స్కానింగ్, X రే యంత్రాలు ఉన్నా సిబ్బంది లేక అవి మూలపడ్డాయి. దీంతో గిరిజనులు, గర్భిణులు పరీక్షల కోసం 60KM దూరంలోని మంచిర్యాల లేదా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం లక్షలు వెచ్చించి యంత్రాలను సమకూర్చినా, నిర్వహణ కరువవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి టెక్నీషియన్లను నియమించాలన్నారు.
SDPT: వివిధ గ్రామాల రైతుల కోరిక మేరకు గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కొండపోచమ్మ కెనాల్ నుంచి హల్దీ వాగులోకి సాగునీరు విడుదల చేశారు. వర్గల్ నవోదయ సమీపంలో జరిగిన కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. రైతు రుణమాఫీ, భరోసా, మద్దతు ధర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ విజయ మోహన్, నాయకులు పాల్గొన్నారు.
MNCL: కవ్వాల్ అభయారణ్యం పరిరక్షణ కోసం బిగించిన ఆంక్షలతో జన్నారం అభివృద్ధికి దూరంగా ఉంది. కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉండగా.. కవ్వాల్ అభయారణ్యంతో పాటు వన్యప్రాణులు, పక్షుల రక్షణకు ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వన్యప్రాణి చట్టం నిబంధనలు అడ్డువస్తున్నాయి.
RR: కాకునూర్లోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, గంటలతో అందంగా అలంకరించి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.
KNR: కరీంనగర్లోని SRR ప్రభుత్వ కళాశాలలోని ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలని సూచించారు.
SRCL: వాకింగ్, వ్యాయామం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని పేర్కొన్నారు.
BDK: అశ్వాపురం మండలం మండికుంట గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ శనివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సీఐ అశోక్ రెడ్డి ఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
KMM: పొన్నెకల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోసా ఇచ్చారు. తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రాత్రి లబ్ధిదారులకు LOC పత్రాని అందజేశారు.
RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 129 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.