GDWL: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
KMR: బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం పిట్లంలో ఆయన మాట్లాడూతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA లక్ష్మీకాంతరావు కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయన్నారు.
SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.
RR: ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోని నోముల గ్రామంలో భార్యని భర్త హత మార్చాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నోములకి చెందిన మధర్మోని బాబు తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన పనస గోవింద్, రెండు రోజుల క్రితం హుజూర్నగర్ వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్లో కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోయిన ఆయన ఇవాళ మేళ్లచెరువు మండలం జోగుకుంట వద్ద గోవింద్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMM: ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ తీవ్రంగా ఖండిచారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని ప్రగల్బాలు పలికే కాంగ్రెస్ నేతలు పేదల ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్లో నమోదు చేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లిలో మండల మహిళా సమైక్య భవనానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు బలోపేతం కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.మహిళల సాధికారత కోసం ఇలాంటి భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు.
SDPT: తోగుట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ స్థాయిలో మెరుగైన పాలనను అందించేందుకు వార్డు సభ్యులకు పలు రకాల పథకాలు, నియమాలు, గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ వంటి వాటిపై తరగతులు నిర్వహించారు.
KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
KMM: భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. పదేళ్లుగా నివాసం ఉంటున్న 600 కుటుంబాలపై పోలీసులు దాడి చేయడం దురదృష్టకరమన్నారు. వెంటనే కూల్చివేతలు నిలిపివేసి, అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
JN: దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్ తన భార్య దస్లీ జ్ఞాపకార్థం అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం భార్య మరణించడంతో ఆమె విగ్రహాన్ని తన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేశారు. అలాగే తాను కూడా ఎప్పటికైనా ఆమెతో కలుస్తాననే భావనతో బతికుండగానే భర్త తన విగ్రహాన్ని ఆమె పక్కనే తయారు చేయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ADB: ఉట్నూర్ మండలం షాంపూర్ వద్ద వాగులో పడి ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును లంబాడ జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇరుకైన బ్రిడ్జిలు ఉండడం వల్లనే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డులు బ్రిడ్జిలు అధ్వాన్నంగా ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
BDK: BRS పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని వనమా సూచించారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నూతన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించారు.