NLG: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేర్చడంలో గెజిటెడ్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.
BPT: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా బాపట్ల పాత బస్టాండ్ వద్ద పోలీసులు బుధవారం సాయంత్రం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం ఆటోలకు కరపత్రాలు అంటించి ప్రచారం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.
VZM: గత నెల 25న రామభద్రపురం వద్ద ఇద్దరి మరణానికీ కారణమైన లారీని స్దానిక SI ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలిస్తే ఛత్తీస్గఢ్కు చెందిన స్వస్తిక్ మినరల్స్ లారీగా తేలింది. డ్రైవర్ ప్రమాదం తర్వాత లారిని కంపెనీకి అప్పగించి పారిపోయాడు. ఈ మేరకు లారీని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చారు.
NZB: అక్రమంగా తరలించడానికి నిలువ ఉంచిన 40 క్వింటాళ్ల PDS బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు నిజామాబాద్ CCS CI సాయినాథ్ తెలిపారు. NZB వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడలో షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో CCS టీమ్ దాడి చేసినట్లు చెప్పారు. PDS బియ్యంతో పాటు బోలోరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
TG: రంగారెడ్డి జిల్లా రాయ్చేడ్లో కల్తీపాల దందా గుట్టురట్టు అయింది. ఉప్పు, చక్కెర కలిపి గేదె పాలు కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాచారం మిల్క్ డిపోకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందిడుతు శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ATP: గుంతకల్లులోని పలు కిరాణా దుకాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. మామజి అనే కిరాణా దుకాణ యజమానికి ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ.2000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VKB: పరిగి పట్టణంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి విక్రయాలకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్(22) వద్ద నుంచి సుమారు 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తెచ్చి కార్మికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
SRPT: TG పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంక్ బ్రాంచ్లలో 298 అనుమానాస్పద మ్యూల్ ఖాతాలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 137 బ్రాంచ్లపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు నిర్వహించింది. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో నేరగాళ్లు ఈ ఖాతాల ద్వారా సైబర్ దందాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.
ADB: గుడిహత్నూర్ మండలం కొల్హారిలో బంజారా సమాజ్ నిర్వహించిన భోగ్ బండార్ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల తీవ్రత, కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక ‘హెవీ క్రైమ్’ స్టేషన్ గా పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల త్వరితగతిన దర్యాప్తు కోసం ఖాళీ అయిన అదనపు ఎస్సై స్థానంలో ఉన్నత అధికారులు మరొక ఎస్సై త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాగా ఇక్కడ పని చేసిన ఎస్సై నాగలక్ష్మి ఇటీవల బదిలీ అయ్యారు.
AP: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. 30వ మలుపు వద్ద అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు తమిళనాడు అరక్కోణంకు చెందిన నటరాజన్గా పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి కల్పన(35) మంగళవారం రాత్రి మరణించింది. తెల్లారి బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, తన భవిష్యత్తు కోసం మనో ధైర్యంతో కుమారుడు రవితేజ పరీక్షను రాసి అందరిని కలిచివేశాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా పరీక్షకు వెళ్లి, అనంతరం తల్లి అంతక్రియలకు హాజరయ్యాడు.
E.G: కొవ్వూరు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు.జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
KRNL: MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం వెల్దుర్తి మండలం కలుగొట్ల నుంచి ఉయ్యాలవాడ వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు స్కార్పియో వాహనంతో వెంటాడి ఇనుప రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు, ఉయ్యాలవాడలో ఉన్న ఒక దుకాణంలో వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.