AKP: కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపు, వీల్ఫైర్ వంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. తోటకూరపాలెం నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించి వచ్చిన గూనూరు ఆదిలక్ష్మిని ఆమె తల్లి వెంకటలక్ష్మి ఎత్తుకొని పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. మెట్లు ఎక్కాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడింది.
JGL: బీర్పూర్ సెక్షన్ పరిధిలోని కొల్వాయి సబ్ స్టేషన్లో 2 నూతన అదనపు 11కేవీ బ్రేకర్లను జగిత్యాల సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనం మంగళవారం ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా, అభివృద్ధి పనుల్లో భాగంగా అంతరాయం సమస్యకు పరిష్కారం చేపట్టామన్నారు. దీనిపట్ల గ్రామాల విద్యుత్ వినయోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డీఈ, ఏడిఈ, ఏఈ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
BHNG: బీబీనగర్ నుంచి నడికుడికి రైలు మార్గం రెండవ లైన్ కోసం భూసేకరణ చేపట్టనున్నట్లు భువనగిరి RDO కృష్ణ రెడ్డి తెలిపారు. భూసేకరణ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి, బొల్లెపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీల చేసి రైతుల భూముల వివరాలను సేకరించినట్లు తెలిపారు.
SKLM: శ్రీకాకుళంలోని డయేరియా కేసులు 76కి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాధితుల కోసం రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రభావిత కాలనీల్లో 50 సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాయి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తాగునీరు మరిగించి తాగాలని వైద్యులు సూచించారు.
NZB: 7 ఏండ్ల క్రితం పుట్టింటికి వెళ్లి భార్య తిరిగి రాలేదని మనస్తాపంతో ఉరివేసుకొని జగదీశ్ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన జగదీష్ 17 ఏళ్ల క్రితం ఓ మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 7 ఏండ్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
SDPT: సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుండి జారిపడి బశెట్టి రాజు (41) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోవా కట్టెలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. మృతుడు సిద్దిపేట వాసిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
MNCL: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపడం అద్భుతమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లికి చెందిన లాస్య శ్రీ, శ్రీనిథ్ సాయి, ప్రమోద్ కుమార్ భారతదేశం తరఫున బహుమతులు సాధించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సబ్ కలెక్టర్ సూచించారు.
VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ విభాగంలో వికారాబాద్ జిల్లా స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల మంగళవారం ఎంఈవో హరిలాల్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, భవాని, కాశయ్య, మల్లయ్య, అనిల్ కుమార్ కలిసి విద్యార్థిని అభినందించారు.
కాకినాడ సాంబమూర్తి నగర్లోని ESI ఆసుపత్రి మంగళవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. సంస్థ 75 వసంతాల వేడుకలతో పాటు దేశంలోని వంద పడకల ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు గాను రెండో స్థానం దక్కించుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సాధించిన ఈ గుర్తింపు పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ATP: పామిడి పట్టణంలోని ప్రముఖ శైవవక్షేత్రమైన భోగేశ్వరాలయం, లక్ష్మీ చెన్నకేశవ ఆలయాల హుండీ కానుకలు బుధవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో క్రిష్ణయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ఉంటుందన్నారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా పంచ, పైపంచ ధరించి పాల్గొనాలని ఆయన కోరారు.
NLR: వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
PPM: మక్కువ మండలం వెంకంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ ముఖంపై తీవ్ర గాయం కాగా, మరొకరికి ఛాతీ మీద గాయమైంది. వీరు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ..10 కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సత్తెనపల్లి రాకేష్, ఆశీర్వాదంపై గతంలో 34 కేసులు ఉన్నాయని, ఈ కేసులో 8మందిని గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
W.G: పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ.. యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు 420, పాము కాటు వ్యాక్సిన్ 400 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.