ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
AKP: అనకాపల్లి దేవుని గుమ్మంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బి. శ్రీనివాసరావు, ఈవో చంద్రతేజ తెలిపారు. 27 ఉదయం ధ్వజారోహణ, రాత్రి కళ్యాణ మహోత్సవం, 28న అన్న సమారాధన జరుగుతుందన్నారు. మార్చి1న అర్ధ ఏకాహం, 2న గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.
NDL: నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
TPT: ఫిబ్రవరి 28న తిరుపతిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రవేశం ఉచితం, కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. నమోదు కోసం https://linktr.ee/rsctpt లింక్ను సందర్శించాలన్నారు.
MLG: దేవాదుల ఎత్తిపోతల పథకంకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,332 కోట్లకు చేరాయి. వేసవి ప్రారంభంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నిరంతరం నడవాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, రోజుకు దాదాపు రూ.1కోటి, నెలకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.
KMR: కామారెడ్డి జిల్లాలో అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు నిర్వహించకూడదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన DRA కమిటీ సమావేశం జరిగింది. DM&HO రవీందర్ గౌడ్ సమావేశంలో నివేదిక సమర్పించారు. సరైన పత్రాలు సమర్పించని 11 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
AP: ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. MAR 1న ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఉంటుంది. దీంతో ఈనెల 28వ తేదీన శనివారం పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని స్పష్టం చేశారు.
HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేక మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఎల్ఓసీల ద్వారా రూ. 521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు.
NGKL: కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్ కర్నూల్కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
NRPT: జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు జరిగే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలని చెప్పారు.
కర్నూలు బళ్లారి చౌరస్తా బైపాస్లో జరుగుతున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మలుపు వద్ద రెండు షాపులను తొలగిస్తామని, పోలీస్ అనుమతి రాగానే పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని కమిషనర్ తెలిపారు.
E.G: రాజమండ్రిలోని ప్రతి నిర్మాణానికి ఆస్తి పన్ను విధించాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్, మెక్ డొనాల్డ్స్, ప్రకాశ్ నగర్ భవనాలను తనిఖీ చేశారు. నిర్మాణ విస్తీర్ణానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోందా లేదా అన్నది కొలతలు వేసి తనిఖీ చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
ATP: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్లో ఖాళీగా ఉన్న 16 పాయింట్స్మెన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎండీ రజాక్ తెలిపారు. అర్హులైన మాజీ సైనికులు వచ్చే నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనంతో పాటు ఇతర భత్యాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
MDCL: మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 10వ తేదీ వరకు అల్పాహార కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా DEO విజయకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున వెచ్చించి పోషకాహారం అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.
W.G: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.