AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం రిషి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళకు 242 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 108 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
TPT: జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, శ్రీ సిటీ పరిశ్రమల విస్తరణకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
PPM: రీ సర్వే జరుగుతున్న గ్రామాలలో ఉప తహసీల్దార్, సర్వేయర్ల డిప్యూటేషన్లు ఉంటే, వాటిని రద్దు చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. రెవెన్యూ, తదితర అంశాలపై అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు.
W.G. గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సోసైటీ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయలేకపోవడం సిగ్గు చేటని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ విమర్శించారు. మంగళవారం తణుకు కోర్టు వద్ద 9వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా “నడి రోడ్డు మీద పడుకొని దణ్ణం పెడుతూ.. సహకార సంఘాల JAC ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జీవో. 36 అమలు చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలన్నారు.
ELR: వట్లూరులోని టీటీడీసీ వెలుగు కార్యాలయంలో ఈ నెల 26న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ గణపతి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం నేరుగా కేంద్రానికి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చు.
కృష్ణా: కేంద్ర శిక్షణ సంస్థ సహకారంతో రూపొందించిన అప్లికేషన్ డెవలపర్, వెబ్ & మొబైల్ కోర్స్ను మార్చి నెల నుంచి పెడన స్కిల్ హబ్లో ఉచితంగా ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కోర్స్ ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వెబ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ నైపుణ్యాలను నేర్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కడప: నగరంలోని 30వ డివిజన్ NTR సర్కిల్, నాయక్ సాహెబ్ వీధిలో సీసీ రోడ్ పనులను మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో ఎంపీ లాడ్స్ ద్వారా రూ. 2 లక్షల నిధులతో పనులు చేపట్టారు. భూమి పూజ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, RIC అధికారులు పాల్గొన్నారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలోని తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి సత్యసాయి నీటి పథకం ఆధునీకరణకు రూ. 50 కోట్లు, మరో 38 గ్రామాల్లో కొత్త నీటి సౌకర్యం కోసం రూ. 55 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
SKLM: ప్రభుత్వం మహిళా సంఘాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గుర్తించేందుకు సేర్ఫ్ ఆధ్వర్యంలో పల్లె పల్లెలో పారదర్శకంగా కుటుంబ ఆదాయ సర్వే చేపట్టినట్లు మందస వెలుగు పీవో కూర్మారావు తెలిపారు. మంగళవారం మందస మండలంలోని గాయత్రి నగర్ పరిధిలో సర్వే నిర్వహిస్తున్న ఈనారీ సీఆర్పీలతో సమావేశమయ్యారు. ప్రతి కుటుంబ ఆదాయాన్ని వాస్తవానికి అనుగుణంగా నమోదు చేయాలన్నారు.
కర్నూలు: బంగారుపేట మున్సిపల్ స్కూల్లో పొక్సో చట్టం, గూడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ చిన్నారులకు 1098 చైల్డ్ హెల్ప్లైన్ సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల సమస్యలను స్నేహపూర్వకంగా తెలుసుకోవాలి అని సూచించారు. ప్రేమ, చెడు ఉద్దేశంతో ఉన్న స్పర్శలో తేడా గుర్తించుకోవాలని అవగాహన కల్పించారు.
ASR: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సలుముర్తి సూరిబాబు డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కొయ్యూరులో అంగన్వాడీలు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీల ధర్నాకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు.
అన్నమయ్య: ఓ 11నెలల పసిపాపను రక్షించేందుకు చేపట్టిన ఈ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ పాప బతకాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని ఓ ఇస్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ గత కొన్ని రోజుల కిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు యువత ఒక్కసారిగా ముందుకు వచ్చింది. చాలా మంది ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు సైతం ఫండింగ్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు.
W.G: ఆకివీడు నగరపంచాయతీ 3 వార్డు వైసీపీ పార్టీకి చెందిన అందే పెద్దిరాజు చాలా కాలం నుంచి ఫంక్రటీస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ రక్తనాళం బ్లాక్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతూన్నాడు. హాస్పిటల్లో చూపించుకుంటే వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పడంతో సియం ఆర్ ఎఫ్ నుండి ఆపరేషన్ కు 1,71,000 ల చెక్కును వినోద్ వర్మ అందజేశారు.కార్యక్రమం లో బిజెపి నాయకులు పాల్గొన్నారు.
NDL: తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని YCP మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాటసాని పిటిషన్పై CJI ధర్మాసనం విచారణ జరిపింది. కాటసానికి భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరోసారి సమీక్షించాలని ధర్మాసనం సూచించింది. భద్రత అవసరమో, కాదో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు, కాలువలు, స్మశాన వాటిక నిర్మాణాలకు మంగళవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో 8వ వార్డు శ్రీకంఠపురం, 27వ వార్డు అంబేడ్కర్ నగర్, 4వ వార్డు త్యాగరాజ నగర్, 33వ వార్డు మేళాపురం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.