NDL: పగిడ్యాల మండలంలో ఎస్సై దుర్భాషలాడడంతో పూజారి బాలశివుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దేవాలయ వివాదం నేపథ్యంలో జరిగిన వాగ్వాదంలో తనను అవమానించారని ఆయన వాపోయారు. అపస్మారక స్థితిలో పడిపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
W.G: నరసాపురం మాధవాయిపాలెంలోని శ్రీ రామాలయంలో సీతారాముల వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామి వారు భానుమూర్తిగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్య వాహనంపై స్వామి వారిని పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 214 మందిపై కేసులు నమోదు చేసి, రూ.49,875 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ దగ్గర పెట్టుకుని వాహనం నడపాలని, శిరస్త్రాణం, సీటు బెల్టు ధరించాలని సూచించారు.
ప్రకాశం: మార్కాపురం మండలంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కంభం పట్టణంలో సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పరిశీలించారు. బస్సుల పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ మరియు భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
PLD: నేడు ఉదయం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలు & దివ్యాంగుల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుంది. ఉదయం 10.30 గం.లకు స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల కోసం, దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
KKD: 2 నెలలుగా కాకినాడ, పోలవరం జిల్లాలను గడగడలాడిస్తున్న పెద్దపులి పోలవరం జిల్లా ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 27 పశువుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దేవీపట్నం, రంప, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పులి తన ప్రతాపం చూపుతోంది. తాజాగా దేవీపట్నం మండలంలో ఒకేసారి 4 పశువులపై దాడి చేయడంతో ఈ ప్రాంత వాసులు వణుకుతున్నారు.
మన్యం: డంగభద్ర పరిసరాల్లో ఏనుగుల కదలికలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వేడి తీవ్రత కారణంగా కొలను వద్దకు చేరిన ఈ గుంపు, సాయంత్రం తర్వాత గ్రామాల వైపు దారితీశాయి. అప్రమత్తంగా ఉండాలని, పంటలను సురక్షితంగా నిల్వ చేసుకోవాలని అటవీ శాఖ రైతులకు హెచ్చరికలు జారీ చేసింది.
అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో రూరల్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, రికార్డులు లేని వాహనాలపై శుక్రవారం కేసులు నమోదు చేశారు. ఎస్సై నాగేశ్వరావు తెలిపిన మేరకు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. రికార్డులు లేని 6 వాహనాలపై కేసులు నమోదు చేశారు.
SKLM: ఎచ్చెర్ల డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB(3Y)కి సంబంధించి 2, 4, 6వ సెమిస్టర్లు, (5Y)కి 2, 4, 6, 10 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 21వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నట్లు యూనివర్సిటీ డీన్ యు.జ్యోష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.1,050 లను ఏప్రిల్ 12వ తేదీలోగా యూనివర్సిటీ లేదా కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
కోనసీమ: మండల కేంద్రమైన ఆలమూరులోని మల్లూరు పాపయ్య టౌన్ హాల్ నందు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్య ఈ వైద్య శిబిరంలో అన్ని వ్యాధులకు ఉచిత పరీక్షలుతో పాటు ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
E.G: కానవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పరిజల్లిపేట, ఇండస్ట్రియల్ ఫీడర్లకు వార్షిక మరమ్మతులు చేపట్టనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జై నటరాజన్ తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కానవరం, చక్రద్వారాబంధం ప్రాంతాల వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి, సిబ్బందికి సహకరించాలన్నారు.
అనకాపల్లి: నక్కపల్లి మండలం దేవవరం గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. సీఐ జె.మురళీ సమాచారం మేరకు ఎస్ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. ఈ దాడిలో రూ.57,310 నగదు, నాలుగు బైక్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అల్లూరి: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం గ్రామంలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చాపరాతిపాలెం గ్రామానికి చెందిన నిత్యశ్రీ (13) పెదవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిత్యశ్రీ ఉరివేసుకుంది. బాలిక మృతదేహాన్ని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వైవో. నందన్ పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. మొండి బకాయిదారులతో నేరుగా మాట్లాడి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. శుక్రవారం ఆస్తి పన్ను వసూలు నిమిత్తం దీప్తి నర్సింగ్ హోమ్ యజమానిని కలిసి నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్నును వెంటనే చెల్లించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రి సమీపంలోని ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి స్వామివారు ఆలూరు గ్రామం నుంచి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం అంకురార్పణ, ధ్వజారోహణం, కలశ స్థాపన, దీక్ష హోమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.