TPT: హైదరాబాద్కు చెందిన రాచమల్లు వెంకట సుజిత అనే భక్తురాలు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్కు శుక్రవారం రూ.1 కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాత, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.
GNTR: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మార్చి 1న అమరావతి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆమె, అనంతరం శంకుస్థాపన వేదికలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
NDL: పల్నాడు జిల్లా పోతవరం సమీపంలో ఆటో ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఆ రూట్లో ప్రయాణిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘటనను గమనించి ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చెప్పడంతో స్థానికులు ఆయన చర్యలను అభినందించారు.
KRNL: అవుకు మండల పరిధిలోని రాయలసీమ రైస్ మిల్ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. మెట్టుపల్లి రోడ్ నుంచి అవుకు బస్టాండ్ వైపు వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ బైక్లో మంటలు చెలరేగాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే దిగిపోయి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పగా, వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న నార్పల మండలంలోని గూగూడులో వెలసిన కుళ్లాయిస్వామి, అంజనేయస్వామి ఆలయాలను మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో శోభ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయాలను మూసివేయనున్నారు. ఆలయ శుద్ది అనంతరం 4న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
KDP: YVUలో AP స్కిల్ డెవలప్మెంట్,YVU ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా జరిగింది. వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించి, విద్యార్థులు ప్రారంభ వేతనం కంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నిరంతర అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మేళాకు 332 మంది హాజరుకాగా, హెటెరో ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి కంపెనీలు 57 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి.
ELR: ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
VSP: విశాఖ నగర ప్రజలు తాగునీటిని వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. నగరంలోని 98 వార్డులకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని, కలుషిత నీరు ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. కాలువల గుండా వెళ్లే 448 పైపులైన్ల మార్పు పనులు రూ. 4 కోట్లతో కొనసాగుతున్నాయని తెలిపారు.
AKP: మండల కేంద్రమైన మునగపాకలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విశ్రాంత ఎస్పీ స్వర్గీయ పెంటకోట సత్యనారాయణ కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ మహిళ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
AKP: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడితే జీవితం అంధకారం అవుతుందన్నారు.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం గన్నవరం ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన 18–35 ఏళ్ల యువత అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన వారికి వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.inలో నమోదు కావాలని సూచించారు.
W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత 2 రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానంపై దిశానిర్దేశం చేశారు.
NLR: యూపీఎస్సీ పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.
E.G: మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం 10:30 గంటలకు నగరంలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అలాగే, 11:30 గంటలకు రాజమండ్రి నుంచి కాకినాడకు బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
NTR: విజయవాడ ఎన్టీఆర్ అడ్మిన్ భవన్ ఎరైవల్ బ్లాక్ 4వ ఫ్లోర్ లో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయాన్ని ఎంపీ కేసినేని చిన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ బాలకోటయ్యను, డైరెక్టర్లను ఎంపీ అభినందించారు. ప్రజా సేవకుడు పోతుల బాలయ్య ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.