సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీలో నివసిస్తున్న వడ్డే మారుతి (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణలో ఎదురైన సమస్యలు, అప్పుల భారం కారణంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
E.G: గోకవరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కరాసు శివప్రసాద్ గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సంత్ గాడ్గే బాబా అవార్డు అందుకున్నారు. రజక జాతి అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను సమాజానికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని బీజేపీ నేత ఉంగరాల ఆది విష్ణు తెలిపారు.
KRNL: వైసీపీ పాలనలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని MLC బీటీ నాయుడు విమర్శించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఏఈ, డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వ్యవస్థ కుదుటపడుతోందని స్పష్టం చేశారు.
PPM: కొమరాడ మండలం దలైపేట గ్రామ సమీపంలో ఉన్న వరి పంట పొలాలలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం తెలిపారు. సమీప ప్రాంత రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఇదిలా ఉంటే పంట పొలాలలో ఏనుగులు గుంపు ప్రవేశించి పంటలను పాడు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SKLM: జలుమూరు మండలం ఆదర్శ మోడల్ స్కూల్ హెచ్ఎం మాధవరావు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు. శుక్రవారం అచ్యుతాపురంలో పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు అందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న MEO మాధవరావు మాట్లాడుతూ.. మండలంలో 16 జెడ్పీ పాఠశాలలు ఉన్నాయని, 462 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా వారందరికి సామాగ్రి అందజేశారన్నారు.
ప్రకాశం: యూటీఎఫ్ ఆధ్వర్యంలో “ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పిద్దాం – ఊరి బడిని కాపాడుకుందాం” కార్యక్రమం భాగంగా శుక్రవారం కనిగిరి మండలం కొత్తపల్లిలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
NLR: ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం(M) సాయిపేట పంచాయతీలో మొసలి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు గేదెలను మేతకు తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా మక్కెనవారిపాలెం వాగులో మొసలి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై కావలి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మొసలి ఆనవాళ్లను పరిశీలించారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం సంబేపల్లి మండలం పీ.ఎన్. కాలనీ పరిధిలోని శంకరాపురం, దాసరివాండ్లపల్లి లేఅవుట్లలో నూతనంగా నిర్మించనున్న రామాలయాలకు భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధార్మిక సంప్రదాయాల పరిరక్షణకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.
ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శుక్రవారం ఉదయం రైలులో అనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజేశ్, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నేడు జిల్లాలో నిర్వహించనున్న పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై స్థానిక నేతలతో చర్చించనున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 11 వార్డులో గుడిపల్లి కాలువపై నిర్మించనున్న కల్వర్టు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు స్వాగతం పలికారు. 50 లక్షల రూపాయలతో కల్వర్టు రిటైనింగ్ నిర్మిస్తున్నామని చెప్పారు. బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
BPT: వీధి కుక్కల సమస్యపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కుక్కల సంఖ్య నియంత్రణ కోసం జంతు జనన నియంత్రణ (ABC) మరియు రేబిస్ నిరోధక టీకాలు (ARV) కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు.
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. మొత్తం 14 మంది బాధితులకు రూ. 6,49,171 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రకృతి రమణీయత భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించిన భానుడి తొలి కిరణాలు ఆలయ రాజగోపురం, శిఖరంపై పడి బంగారు వర్ణంలో ధగధగలాడాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు తమ చరవాణుల్లో ఈ సుందర దృశ్యాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, వికలాంగుల కాలనీల్లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై సైబర్ క్రైమ్స్, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.