KRNL: టీడీపీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్పను అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్కు దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన, శుచిశుభ్రమైన భోజనం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసం కావడం, పలువురు గాయపడటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ATP: నార్పలలోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. పాడి పశువులకు, చేతి వృత్తులకు PMJBNLM ముద్ర రుణాలు లబ్ధిదారులకు ఇవ్వాలని, రైతు పాత బకాయిలకు సంక్షేమ ఫలాలు జమ చేయవద్దని ఆయన పేర్కొన్నారు.
E.G: తూ.గో జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల సమర్పణ గడువును మరో 3 రోజులు వరకు పొడిగించినట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి బుధవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు ఈ పోస్టునకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు అప్లై చేసుకోవాలి అన్నారు.
ప్రకాశం: పొదిలి పట్టణ ప్రజలకు నగర కమిషనర్ మారుతీరావు మంచి అవకాశం కల్పించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5% రాయితీ పొందవచ్చని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని సూచించారు.
KRNL: పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు ఆలూరులో అన్న క్యాంటీన్ను ఇవాళ ప్రారంభించారు. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. CM చంద్రబాబు ఎప్పుడూ పేదల పక్షపాతిగా నిలుస్తారని కొనియాడారు. ఈ సౌకర్యం పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందన్నారు.
కోనసీమ: కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జనాభా గణనపై తొలిరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల తహసీల్దార్ వై. రాంబాబు, ఎంపీడీవో నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనాభా గణన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వ్యక్తి వివరాలను నిర్దిష్టంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
GNTR: తెనాలిలో అరుదైన DMD వ్యాధితో బాధపడుతున్న అశ్వర్త్ గురుదత్తకు దాతలు బాసటగా నిలుస్తున్నారు. హరీష్ కుమార్, నవ్యశ్రీ దంపతుల కుమారుడు అశ్వర్త్ కండరాల వ్యాధితో బాధపడుతూ.. సాయం కోసం ఎదురు చూస్తుండటంపై కథనం రావటంతో దాతలు ఆన్లైన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండగా, మరికొందరు నేరుగా వెళ్లి తమ వంతు చేయూత ఇస్తున్నారు.
ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన సంగా తేజస్విని టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈమె గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
PPM: కురుపాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కంచుకోటగా మారాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.లేవిడి జంక్షన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని, ప్రతి ఇంటా కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. మండల, పంచాయతీ కమిటీలను వేగవంతం చేయాలన్నారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వెంటనే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KRNL: ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందిన కేసారం సాయిరాం బైపీసీలో 921 మార్కులు సాధించాడు. కర్నూలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చదివిన అతన్ని కూలీ పనులు చేసే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
VSP: ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి ఏడాదిలో 37,891 మందికి గానూ 32,334 మంది (85%) ఉత్తీర్ణులై రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు. రెండో ఏడాదిలో 37,422 మందికి గానూ 32,034 మంది (86%) పాసై 7వ స్థానం దక్కించుకున్నారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CTR: మహిళల్లో వేగంగా పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్పై ముందస్తు పరీక్షలు, అవగాహన ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచించారు. ఈ మేరకు చిత్తూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన లోపంతో చాలా మంది మూడో, నాల్గో దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారన్నారని తెలిపారు. స్త్రీలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.