CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని చికిత్స చేయించుకోవాలని కోరారు.
GNTR: రాజధాని రెండో దఫా భూసమీకరణ కొనసాగుతోంది. అమరావతి పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు 1529 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. ఎండ్రాయిలో 580, కర్లపూడిలో 592, పెదమద్దూరులో 342, వైకుంఠపురంలో 15 ఎకరాలు పూలింగ్కు వచ్చాయి. ఈ గ్రామాల్లో మొత్తం 7,562 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ప్రస్తుతానికి 1529 ఎకరాలే వచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు మంగళవారం వెల్లడించారు.
ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి ఏడాది ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 672 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు ముగిసిన రెండు నెలల్లోపే ఫలితాలు విడుదలయ్యాయి.
సత్యసాయి: పుట్టపర్తి విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిభవన్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
VSP: జిల్లాలో సైబర్ మోసాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్గిస్తున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు మాత్రం రోజురోజుకీ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ ఫోటోతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీవీఎంసీ అధికారులకు డబ్బులు అడుగుతున్నట్టు మెసేజ్లు పంపారు.
ASR: అంజలి శనివారం గ్రామానికి చెందిన లైన్మైన్ ఎర్రం దొర గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. జి. మాడుగుల మండలంలో నుర్మతి పరిధిలో లైన్మైన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నర్సీపట్నం తన స్వగృహం వద్ద మంగళవారం రాత్రి ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.
ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మంగళవారం రాత్రి చాతుకుపాడు గ్రామానికి చెందిన శిరోమణి అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేశారు. వ్యక్తిగత పనులపై మహిళ ఒంగోలు వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో దొంగలు తన బంగారు గొలుసు చోరీ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KDP: కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈనెల 26న అనంతపురం లలిత కళా పరిషత్లో నిర్వహించనున్న బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్థాయి వరకు వెళ్లి బీసీల సమస్యలపై చైతన్యం కల్పించాలని జగన్ సూచించారు.
PPM: ఖడ్గవలస కూడలిలో బస్సు షెల్టరు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సరైన విశ్రాంతి భవనం లేకపోవడంతో పార్వతీపురం, పాలకొండ, కురుపాం గిరి జన మండలాలు, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల కోసం వైకూడలి వద్ద దుకాణాల ముందు, రోడ్డుపై నిలబ డాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో బస్సు షెల్టరు నిర్మాణానికి తమవంతు కృషి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ రీజనల్ ఛైర్మన్గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పేరిచర్ల మురళీ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం వాకర్స్ క్లబ్లో వివరాలు వెల్లడించారు. గతకొన్నేళ్లుగా లైన్స్ క్లబ్, డైమండ్ క్లబ్, పేరిచర్ల ఫౌండేషన్ ద్వారా చేసిన వివిధ సేవలకు గాను తనకు పదవి ఇచ్చినట్లు నియామక పత్రాన్ని విడుదల చేశారు.
SKLM: వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్కు పోలీసులు మంగళవారం నోటీసులు అందజేశారు. పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 9న పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టిన ఘటనపై పోలీసులు వివరణ కోరారు. ఎస్సై రాము స్థానిక పార్టీ కార్యాలయంలో తిలక్కు నోటీసులు ఇచ్చారు.
VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనను నిలిపివేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. జనగణన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను అమలు చేయవద్దని పిటీషనర్లు కోరారు. వారి తరపున సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, జీఏల్ నరసింహరెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం సమయం కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ కీలకంగా మారింది.
బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త చెప్పారు. గ్రామంలో దాదాపుగా 11 ఎకరాలలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టామని ఆయన వెల్లడించారు. నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో మండలంలోని రైతులకు విద్యుత్ బాధలు తీరునున్నాయి.
CTR: దీర్ఘకాలంగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని PRTU ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని నాయకులు కోరారు. పెండింగ్ డీఏలను చెల్లించాలన్నారు. టెట్ పరీక్ష రద్దు చేయాలని, జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో చేయాలన్నారు. అనంతరం డీఆర్వో మోహన్కు వినతిపత్రం అందించారు.
E.G: రాజమండ్రి నన్నయ విశ్వవిద్యాలయం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం 20 రకాల థీమ్స్లతో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది కన్వెన్షన్ సెంటర్ వద్ద AKNU@20 ఆకారంలో నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. చాళుక్య ద్వారం నుంచి విద్యార్థులు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.