నంద్యాలలో అర్హులైన పాత్రికేయులకు టిడ్కో గృహాలు కేటాయిస్తామని ఇవాళ మంత్రి ఫరూక్ తెలిపారు. అయ్యలూరు, ఎస్.ఆర్.బి.సి కాలనీల్లో ఇళ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కడప జిల్లాలో నేరాల నియంత్రణ కోసం నైట్ పెట్రోలింగ్ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో రాత్రి గస్తీ ముమ్మరం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద సమాచారాన్ని 112కు తెలియజేయాలని సూచించారు.
ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
VSP: ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్ స్వామి ఇవాళ ఉదయం విశాఖలో కన్నుమూశారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటుగా నిలిచింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖ విశాలాక్షి నగర్లోని కుమార్తె నివాసం నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్సిస్టు అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, తదితరులు నివాళులు అర్పించారు.
GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. డా. అన్నీ గ్రేస్, డా. సబీరా బేగం నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని నుదురుపాడు వీధుల్లో స్లోగన్లు పలుకుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఇవాళ స్దానిక శ్రీకృష్ణ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరగా అక్కడికక్కడే కమిషనర్ కొన్ని సమస్యలు పరిష్కరించారు. పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
AKP: దోమలను నియంత్రించినప్పుడే మలేరియాను నిర్మూలించవచ్చునని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ అనకాపల్లి గాంధీ నగరంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ఆయన అవగాహన సదస్సును నిర్వహించారు. మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని అన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇమామ్లు, మౌజన్ల పారితోషికాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మసీదుల అధ్యక్షులు, ముతవల్లీలు రిజిస్టర్ పత్రాలను ఏప్రిల్ 30 లోపు ఇవ్వాలన్నారు. గుంటూరు కలెక్టరేట్లోని వక్ఫ్ బోర్డు ఆఫీసులో వీటిని అందజేయాలని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసారథి శనివారం చెప్పారు. సందేహాలుంటే గుంటూరు, బాపట్ల వక్ఫ్ ప్రతినిధులను కలవాలని సూచించారు.
E.G: రాజమండ్రిలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శనివారం దానవాయిపేటలో భారత్ పెట్రోల్ బంకులు పెట్రోల్ లేదని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు నిరాశతో వెను తిరుగుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ చోటుకి వెళ్లాలన్నా వాహనాల్లో ఇంధనాన్ని నింపాలి. ప్రభుత్వం నుంచి ఎటువంటి హెచ్చరికలు రాకపోయినా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అనడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో మండపం జంక్షన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి ఎలమంచిలిలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లి పత్రికలు పెంచడానికి బైక్ పై వెళ్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
BPT: కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల డీఎస్పీ హెచ్.చంద్రమౌళి విచ్చేసి చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
ATP: రాయదుర్గం మండలం వేపరాళ్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం నీటి కుంటలోకి వెళ్లిన పదో తరగతి విద్యార్థి శరత్ ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. కోనాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో శోకసంద్రం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 27న శ్రీకూర్మ నాథుని దర్శించుకోనున్నారు. దీంతో ఆలయంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయంలో ఉపరాష్ట్రపతి దర్శనానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏర్పాట్లను ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్, సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కూర్మ నాథుడి వార్షిక కళ్యాణ ముహూర్తం అదే రోజు ఉండటంతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తున్నారు.
KDP: మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష విలేకరుల సమావేశంలో పెద్ద దస్తగిరి హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినా రక్షణ కల్పించలేదని విమర్శించారు. స్వయంగా ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. దస్తగిరి కాల్ డేటా ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
AKP: మలేరియా నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య విస్తరణ అధికారులు బుల్లిబాబు, బెన్నయ్య తెలిపారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ కోటవురట్లలో వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియాకు ప్రధాన కారణమైన దోమలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు.