VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
SKLM: రణస్థలం మండలం పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు.
KKD: అన్నవరం శ్రీ వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రత్నగిరిపై టోల్ గేట్ నుంచి సెంటినరీ కాటేజ్ వరకు 1.30 కోట్ల రూపాయలతో నూతన మెట్ల మార్గం నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సత్యప్రభ వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
E.G: నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ కళాపకర్షణ, జీర్ణోద్ధారణ బలాలయ స్థాపన కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ATP: అనారోగ్యం నుంచి కోలుకున్న డీఈవో ప్రసాద్ బాబు ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర అస్వస్థతతో ఈనెల 8 ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉండడంతో స్టంట్ వేశారు. రెండు రోజుల పర్యవేక్షణ అనంతరం ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో వారిని కుటుంబ సభ్యులు తమ సొంతూరు కడపకు తీసుకువెళ్లారు.
VSP: నగరంలోని ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ (IIAM) బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ‘పిన్నాకిల్-2026’ మేనేజ్మెంట్, ఐటీ ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలో సంస్థ డీన్ డాక్టర్ ఎస్.పి. రవీంద్ర మాట్లాడుతూ, ఇటువంటి వేడుకలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
కోనసీమ: వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా అమలాపురం మండలంకి చెందిన సుంకర లక్ష్మీ కుమారి నియమితులయ్యారు. తాడేపల్లి లో ఉన్న కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు ఇవాళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ మంత్రి విశ్వరూప్ అభినందించారు.
కోనసీమ: కాజులూరు మండలంలో వ్యాపార తగాదా విషయంలో సన్నపు లక్ష్మి అనే మహిళ పట్ల వివక్ష చూపి, దుర్భాషలాడిన జనసేన నేత అన్యం శ్రీరామచంద్రమూర్తిపై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. బాధితురాలు న్యాయం కోసం ఆశ్రయించగా, ఆమె కులం పేరుతో అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు.
TPT: సూళ్లూరుపేట ప్రజలకు మున్సిపాలిటీ శుభవార్త ప్రకటించింది. పాత బకాయిలపై 50% వడ్డీ రాయితీతో పాటు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు చెల్లింపులపై 5% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ ఏప్రిల్ 30వ తేదీ వరకే అమల్లో ఉంటుంది. సెలవు రోజుల్లోనూ పన్నులు చెల్లించుకునే అవకాశం ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో చెల్లింపులు చేయవచ్చు.
W.G: కళలకు పుట్టినిల్లు పాలకొల్లు అని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి యువతను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ATP: జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయం మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. హోస్పేటలో చివరి క్రెస్ట్ గేటు తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. 33 గేట్లలో ఇప్పటికే 26 అమర్చగా, మిగిలిన 7 గేట్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి నిల్వకు సిద్ధం కానుందన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అనిల్ మాట్లాడుతూ 2026 ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తెలిపారు. క్రికెట్ను ఆస్వాదించడమే కాకుండా కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు కోల్పోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ వెంకటరత్నం హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో ఉపాధి పనుల్లో రూ.17.29 లక్షలు, పంచాయతీరాజ్ పనుల్లో రూ.40 వేల అక్రమాలు గుర్తించగా, ఇప్పటివరకు రూ.55 వేల వసూలు చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ. 120 ఉండగా, స్కిన్ కేజీ రూ. 240-260, స్కిన్ లెస్ రూ. 270-280 వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 900-1000 మధ్య ఉంది. 100 కోడిగుడ్లు రూ. 600లుగా ఉన్నాయి. దాదాపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఇదే ధరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
AKP: కోటవురట్ల పరిసరాల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో చికెన్ ధరలు తగ్గాయి. ఆదివారం మార్కెట్లో బ్రాయిలర్ లైవ్ కిలో రూ.130, చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.240కు అమ్ముతున్నారు. బండ కోడి ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి గత వారం రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.160కు లభిస్తోంది.