W.G: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్నోవా కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట జంక్షన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
AKP: తిమ్మాపురం పంచాయతీ పరిధిలో విద్యుత్ స్తంభాలు, వైరుకు కలిపి రూ.1.90 లక్షలు విద్యుత్ శాఖకు కట్టినా ఇప్పటివరకు పనులు జరగలేదని గ్రామ మాజీ సర్పంచ్ కె సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీధిలైట్లు సౌకర్యం కోసం కట్టి రెండు నెలలు దాటుతున్నా సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
KRNL: పత్తికొండ నియోజకవర్గంలో కోర్ కమిటీలు, అనుబంధ విభాగాల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ తెలిపారు. మిగిలిన గ్రామాల్లో సభ్యుల వెరిఫికేషన్ను అధికారిక లింక్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను 2,3 రోజుల్లో పూర్తి చేయాలని, అనంతరం ఐడి కార్డులు అందజేస్తామని తెలిపారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు పేటలోని టీడీపీ కార్యాలయంలో అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన అందమైన ముగ్గు వద్ద మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంబరాల్లో భాగమయ్యారు.
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వారి సమస్యలను సావధానంగా విని ఫోన్లు ద్వారా అధికారులతో మాట్లాడారు. కొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ATP: యాడికిలో జరిగిన జలధార సభలో CM చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గ ప్రగతి నివేదికను స్వయంగా చదివి వినిపించారు. సరిగ్గా పనిచేయని అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ కోరారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆదాయం తగ్గినా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
PPM: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
VZM: వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా, భూగర్భ జల మట్టాలను పెంచి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఊర చెరువు వద్ద నిర్వహించిన జలధార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు.
KRNL: క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ నేత అమ్లివాలే ఫయాజ్ డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. గతంలో వివక్ష కారణంగానే దళితులు మతం మారారని, వారిని ఎస్సీలుగా గుర్తించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.
పోలవరం జిల్లా ఏకలవ్య పాఠశాలల్లో బ్యాక్ లాక్ సీట్లు భర్తీకి అప్లై చేసుకోవాలని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య సోమవారం తెలిపారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, వై. రామవరం, చింతూరు, మారేడుమిల్లి పాఠశాలల్లో 7, 8, 9వ తరగతుల్లో 24 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పేరెంట్స్ ఆదాయం ఏడాదికి రూ.లక్షలోపు ఉన్న గిరిజన బాల బాలికలు అర్హులన్నారు.
NLR: ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సూచించారు. సోమవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో వైద్య సిబ్బంది పర్యటించారు. సన్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నందున ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తిరుపతి, చిత్తూరు జిల్లా మీదుగా 2 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మైసూరు-చెన్నై కారిడార్లో భాగంగా CTR- TPT మీదుగా నాయుడుపేటకు లింక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరగా కేంద్రం అమోదించింది. దీంతో నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్, నాయుడుపేట, TPT, CTR, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరుకు మరో కారిడార్ ఏర్పాటు కానుంది.
E.G: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి CMRF ఒక సంజీవనిలా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన CMRF చెక్కులు & LOC పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాం సెంటర్ ప్రాంతంలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, సీఐ వీరేంద్రబాబు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
BPT: ఈ నెల 9న సీఎం చంద్రబాబు సూరేపల్లెకు రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రోటోకాల్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.