KRNL: పెద్దకడబూరు PHCలో మందుల కాల్చివేతపై అధికారులు స్పందించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి ఇవాళ స్థానిక పీహెచ్సీని సందర్శించారు. మందుల కాల్చివేత ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆసుపత్రిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
TPT: నారాయణవనం మండలంలో ఎండలు పెరిగాయి. ఈనేపథ్యంలో పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఆనంద్ కోరారు.
NLR: బుచ్చి పట్టణం ఖాజా నగర్ 7 వార్డులో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి పర్యటించారు. ధ్వంసమైన డ్రైనేజీ, అమృత్ 2.0 పథకం కింద పైప్ లైన్ ఏర్పాటుకు రోడ్లను గుంతల మయం చేసి పూడ్చలేదని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
KDP: రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తాగునీరు, విద్యుత్, రోడ్లు, పింఛన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: అనంతపురం ఆర్డీటీ సేవల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సంస్థ ప్రతినిధులు మాంచో ఫెర్రర్, విశాలా ఫెర్రర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ విశిష్ట సేవలు అందిస్తోందని ఎంపీ కొనియాడారు. ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
W.G: జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో తణుకు మున్సిపాలిటీ 81 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. మొత్తం రూ.16.46 కోట్లకు గాను రూ.13.34 కోట్లు వసూలయ్యాయని, పాలకొల్లు రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ ఫోన్- ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. 6వ డివిజన్లోని స్మశాన వాటికను పరిశీలించారు. రోడ్డుపైనే అంత్యక్రియల ముందు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించి, స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఇకపై స్మశాన వాటిక లోపలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ATP: గుత్తి మండలం యంగన్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఇవాళ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఫేస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ యాప్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ పనులలో అవినీతిని అరికట్టవచ్చన్నారు.
TPT: శ్రీకాళహస్తి గుడికి అనుబంధంగా ఉన్న కైలాస సదన్, గంగా సదన్ వసతి గృహాలను ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గురువారం సందర్శించారు. భక్తులకు అందుతున్న సేవలు, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ చొరవతో దుగ్గిరాల మండలం చిలువూరు–తుమ్మపూడి గ్రామాల మధ్య డ్రైన్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రూ.1.20 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరయ్యాయని నేతలు తెలిపారు.
TPT: ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సూళ్లూరుపేట పోలీసులకు వైసీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పించలని డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సై అజయ్ కుమార్ను కోరారు.
SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ పరిశీలించారు. కోడిరామ్మూర్తి స్టేడియం పనులను సమీక్షిస్తూ.. స్టేడియం సివిల్ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రూ.2.6 కోట్లతో ఆధునిక క్రీడా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసామన్నారు.
KRNL: గూడూరు పట్టణంలో ఈనెల 13న జరిగే శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సు సర్వీసులు నడపాలని APSRTC కర్నూలు రీజనల్ మేనేజర్కు, గూడూరు పట్టణ అధ్యక్షులు కె. రామాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్ ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఉన్న సర్వీసులకు అదనంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.
కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం వైసీపీ ఇంఛార్జి పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో పట్టణ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని కోరారు.
PLD: మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు బుల్ల రాజారావు పిలుపు మేరకు శుక్రవారం క్రోసూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర హానర్బల్ ఛైర్మన్ సేవరత్న గార్లపాటి దాసు జ్యోతిరావు పూలే గురించి మాట్లాడారు.