ELR: దేశంలోని కార్మిక వర్గాన్ని 140 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులకు నెట్టి వేసేందుకు తెచ్చిన 4 లేబరు కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పిఎఫ్, ఈఎస్సై, గ్రాట్యూటీ వంటి పథకాలు పొందడానికి ఇవి అడ్డుపడయతన్నారు.
CTR: పుంగనూరులో జాతీయ రహదారికి రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గృహాలను కూల్చి వేసినప్పుడు ఆ వ్యర్థాలను పలమనేరు రోడ్డు ఓం శక్తి ఆలయం వద్ద నుంచి తోపుమట్టం వరకు డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరపాటులో ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని రాంకో సిమెంట్ కళ్యాణ మండపంలో ఇవాళ మీర్జాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి కుమార్తె అఖిల నవీన్ కుమార్ రెడ్డి వివాహ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలలో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.
GNTR: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరఫరాలో చిన్న అంతరాయాల వల్లే కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్పై చర్యలు, రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రజలు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను సత్యసాయి జిల్లా కురుబ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కురుబ సంఘం బలోపేతానికి సభ్యులు చురుగ్గా కృషి చేయాలని మంత్రి సూచించారు. సంఘం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి తమ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
E.G: జిల్లాలో పెట్రోల్/ డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జేసి మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. డీజిల్ / పెట్రోల్ కొరతపై హెల్ప్లైన్ నెంబర్ 8074661259 ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంధన స్టాక్ సమస్యలు ఎదుర్కొంటున్న డీలర్లు 1967 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులు సమస్యలపై స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోనిలో ఆదివారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
W.G: ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణానికి మే 3న ఉదయం 7:14 గంటలకు శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఉండి MLA రఘురామరాజు తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆదివారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి, విగ్రహాలను సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవ్యమైన ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
KDP: గోపవరం మండలం శ్రీనివాసపురంలో రామాంజనేయ గుండెపోటుతో మృతి చెందాడు. 4 రోజుల పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు హనుమంతు నాయుడు, వెంకటసుబ్బమ్మల కుమారుడు. కమ్మవారి పల్లెకు చెందిన వెంగమ్మతో వివాహం కాగా,వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
SKLM: సాక్షి పత్రికలో వ్యవసాయంపై ప్రచురితమైన వక్రీకృత కథనాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతుల కష్టాలను కావాలనే వక్రీకరించి, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉన్న సాధారణ పరిస్థితులను మొత్తం రాష్ట్రానికి వర్తింపజేసి, రాజకీయ దురుద్దేశంతో చేసిన కుట్రపూరిత ప్రచారమని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అన్నమయ్య: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఆదేశించారు. అక్రమ మద్యం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, రౌడీయిజంపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత కోసం ‘శక్తి’ టీమ్స్ ద్వారా నిరంతర పెట్రోలింగ్, సోషల్ మీడియా వేధింపులపై చర్యలు చేపట్టాలని తెలిపారు.
ASR: జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్ డా. కంబిడి కృష్ణకుమారి ఆదివారం అరకులోయ మండలం ఎండపల్లి వలస గ్రామంలో గిరిజన మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల హక్కులు, చట్ట పరిరక్షణలు, భద్రతపై వివరణ ఇచ్చారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిరుపేద గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు.
విజయనగరం రీడ్స్ సంస్థ 100 వారాల పుస్తకాలు పఠన వేడుకలను ఆదివారం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IRS అధికారి డా.కె. కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిన్నారుల పఠన ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, అవార్డులు, సత్కారాలు, బుక్మార్క్ విడుదల, ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
విశాఖ బీచ్ రోడ్డులో జనగణన-2027పై అవగాహన కోసం 5కే ర్యాలీ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డీఆర్వో ఎం. విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ కమిషనర్ రమణమూర్తి ప్రారంభించారు. డిజిటల్ పద్ధతిలో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ వేలాది మంది యువత ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కోనసీమ: ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమనేది మంచి పరిపాలనకు నిదర్శనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఈతకోటలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు ప్రజా దర్బార్ వారధిగా పనిచేస్తుందన్నారు. ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు.