W.G: ఆకివీడులోని శ్రీ మదన గోపాల స్వామి ఆలయ పాలకవర్గ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఈవో అల్లూరి సత్యనారాయణ రాజు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ఆసక్తి గలవారు 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
PLD: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి ఆయన సేవలు మరింత బలోపేతం అవుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. విలువల ఆధారిత రాజకీయాలకు కట్టుబడి ఉన్న నేతగా కన్నాను ప్రశంసిస్తూ, ఈ నియామకంతో కేడర్లో కొత్త ఉత్సాహం నింపబడిందని తెలిపారు.
KKD: కరప జెడ్పీ హైస్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యంత వెనుకబడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. బైపీసీలో 18 మందికి కేవలం ఏడుగురే పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలోనూ ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి.
KDP: రాజంపేటలో దివ్యాంగ శక్తి పథకం కింద బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నిర్వహించారు. ఒక్కో పాస్కు రు.100 చొప్పున 2000 మందికి పైగా దివ్యాంగులకు సొంత నిధులతో చెల్లించి పాసులు అందజేశారు. ఇంటి వద్దకే పత్రాలు సేకరించి పాసులు ఇవ్వడం ద్వారా సమయం, ఖర్చు తగ్గించినట్లు తెలిపారు.
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సెన్సెస్-2027 రెండో విడత శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ తిరుపతి స్వామి పాల్గొని ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. మొబైల్ యాప్ల ద్వారా డేటా సేకరణపై అవగాహన కల్పించారు. కచ్చితమైన గణాంకాలతోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. మొత్తం నాలుగు బ్యాచ్లకు గానూ రెండో బ్యాచ్ శిక్షణ పూర్తయింది.
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. లేఔట్లలో పేకాట ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. 3400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి గురించి సమాచారం ఇవ్వాలని ఎస్సై వేమన కోరారు.
W.G: టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యునిగా మంతెన రామరాజు నియమితులయ్యారు. ఉండి ఎమ్మెల్యేగా 2019 -24 వరకు ఆయన సేవలందించారు. రఘురామరాజుకు టికెట్ ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఏపీఐఐసీ ఛైర్మన్గా ఆయనను నియమించింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. సౌమ్యుడిగా పేరు పొందిన రామరాజును పోలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకుంది.
NDL: ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా సంజామల(నంద్యాల) 44.6°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43-44°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమ గోదావరి, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
SKLM: సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన నెయ్యిల కుసుమాంజలి ఇంటర్మీడియట్ పరీక్షలో 978/1000 మార్కులు సాధించింది. సత్తబొమ్మాలి మండల మాజీ PACS అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆమెను అభినందించారు. పేద కుటుంబానికి చెందిన కుసుమాంజలి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గ్రామానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
కడప రైల్వే స్టేషన్లో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం–కడప ఎక్స్ప్రెస్ రైలుతో పాటు స్టేషన్ పరిసరాలు, పార్సెల్ సెంటర్లు, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
TPT: తిరుపతి కపిలేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కపిలతీర్థంలో స్నానం చేసి, విఘ్నేశ్వరుడు, కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి దర్శనం చేస్తే శ్రేయస్సు, సంతానం, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాలభైరవ స్వామి, కోటిలింగాలు దర్శనం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని తెలిపారు.
VSP: సీతమ్మధార ప్రకాష్రావుపేటలో బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను గుర్తించి వెంటనే నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్లాప్ వాహనాలు సమయానికి రావాలని, పారిశుధ్య కార్మికులు ఉదయం 5:30కే పనులు ప్రారంభించాలన్నారు.
సత్యసాయి: బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘మా ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా కాలనీని సందర్శించిన మంత్రికి ప్రజలు వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని హరీష్ బాబుకు సూచించారు.