KDP: దిగువరాచపల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.
కృష్ణా: అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారు, ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ట వేద పండితులచే జరిపించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగస్వాములయ్యారు.
KKD: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను సామర్లకోట ఎస్సై రాజా ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి స్టేషన్ సిబ్బందితో కలిసి సామర్లకోట పట్టణంలో గల పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
E.G: దొంగతనాలతో దూబచర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆదివారం విమర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మొబైల్ ఫోన్స్, ఇళ్లలోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
కోనసీమ: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల కోసం కోనసీమ వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు నిమిషం నిబంధనను పాటిస్తూ 10 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలన్నారు.
GNTR: పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గంగాణమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అమ్మవారికి పూజలు చేసి పూజా సామాగ్రి గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తిరుపతి నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, 0877-2227208 నంబర్కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని తెలిపారు.
ATP: గరుగు చింతలపల్లి చెరువుకు నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకే శైలజానాథ్ నాయకత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రకాశం: ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు
SKLM: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గార మండలం సతివాడ పంచాయతీ యాలపేట గ్రామంలో ఉన్న పాఠశాలలో రూ 3.8 లక్షలతో మరుగుదొడ్లు, రూ 9.8 లక్షలతో పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల భద్రత పరిరక్షణ అవసరం అన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరంలో ఆదివారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
PLD: చిలకలూరిపేట టిడ్కో గృహాల వద్ద రూ. 3.60 కోట్లతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్కు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 5,520 కుటుంబాలకు సౌకర్యంగా ఉండేలా 30 దుకాణాలతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడ నివాసముంటూ ఉపాధి లేని వారికే ఈ షాపులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఆరు నెలల్లోగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని రంగాపురం గ్రామంలో కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు.