ATP: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. యశ్వంతపూర్ నుంచి ధన్బాద్కు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి శనివారం వీక్లీ రైలు (06563) నడవనుంది. తిరుగు ప్రయాణంలో (06564) సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే యశ్వంతపూర్-హజ్రత్ నిజాముద్దీన్కు ఈనెల 25న ప్రత్యేక రైలు (06569) నడుస్తుందని అధికారులు తెలిపారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు మూడో రోజైన శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. యోగేంద్ర కళా మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. డాక్టర్ పద్మిని సంగీత కచేరి వీనులవిందుగా సాగగా, బెంగళూరుకు చెందిన నాటేశ్వర నృత్య కళాకారులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
SKLM: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్ర కళా సమితి అధ్యక్షులు శంకరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో స్వాగత ద్వారాలు, కళాకారులకు వసతికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిలకించేందుకు అందరూ రావచ్చన్నారు.
VZM: స్వచ్చాంధ్ర-స్వర్థాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ జీరో వేస్ట్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానిక MPDO రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు వేరుగా అందించే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్త వెయ్యవద్దన్నారు.
E.G: ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 2004లో మహేశ్ అనే వ్యక్తికి మంజూరైన 5 సెంట్ల భూమి పట్టాను నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
మార్కాపురం జిల్లా మండలంలోని చిన్న కంభం సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ వెంకట నరసయ్య తెలిపారు. చిన్న కంభం, దేవనగరం, గోవిందాపురం, దర్గా మరియు గచ్చు కాలువ ఫీడర్ పరిధిలోనిఅంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
AKP: మునగపాక ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఆలయం ఆవరణలో అదిష్టింప చేసి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.
NTR: విజయవాడ కార్పొరేషన్లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ. 15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
PLD: నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈఈ సుచరిత తెలిపారు. సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసే పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. సుమారు 6 గంటల పాటు కరెంట్ కోత ఉంటుందని, గ్రామ ప్రజలు గమనించి శాఖకు సహకరించాలని ఆమె కోరారు.
కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో ఆదివారం శెట్టిబలిజ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించనున్నట్లు సంఘ పెద్దలు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలంగాణ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ పాల్గొంటారని తెలిపారు.
NLR: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ATP: మిర్చి పంట దొంగతనాలను అరికట్టేందుకు విడపనకల్లు మండల పోలీసులు గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. CI మహనంది, ఎస్సై ఖాజా మొహిద్దీన్ పొలాల్లో పర్యటించి భద్రతా చర్యలు సూచించారు. పంట రాశుల వద్ద రాత్రిపూట కనీసం ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100, 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
GNTR: కొల్లిపర మండలం తూములూరు అడ్డరోడ్డు సెంటర్లో శుక్రవారం రాత్రి పేకాడుతున్న ఏడుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ. 4,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ: ఐ. పోలవరం మండలం మురముళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఏఈ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.పోలవరం, తిలకుప్ప, కొమరిగిరి, కేసనకుర్రు, టి.కొత్తపల్లి, జి.వేమవరం గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది అని తెలిపారు.